Telangana DGP: మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఏకంగా 45 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. తుపాకులను విడిచిపెట్టి జన జీవ స్రవంతిలో కలిసిపోయారు. లొంగిపోయిన వారిలో టాప్ మావోయిస్టు నేత గెరిల్లా ఆర్మీ ముఖ్యనాయకుడు బర్సే దేవా కూడా ఉన్నారు. అలాగే తెలంగాణకు చెందిన మావో నేత రాజిరెడ్డి సైతం ఉన్నారు. మావోల లొంగుబాటు అనంతరం మీడియాతో మాట్లాడిన డీజీపీ శివధర్ రెడ్డి.. కీలక విషయాలను తెలియజేశారు.
రూ.75 లక్షల రివార్డు
మావోయిస్టులు తమ నేతను అనుసరించి రెండు గ్రూపులుగా లొంగిపోయినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. బర్సీ సుక్కా అలియాస్ దేవతో పాటు 17 మంది మావోలు జన జీవన స్రవంతిలో కలిసినట్లు చెప్పారు. అలాగే తెలంగాణకు చెందిన రాజిరెడ్డి అతని భార్యతో కలిపి 20 మంది పోలీసులకు సరెండర్ అయ్యారన్నారు. ఇటీవల మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా గ్రామానికే దేవా కూడా చెందినవాడని డీజీపీ తెలిపారు. దేవాపై ఎన్ఐఏ రూ.75 లక్షల రివార్డు ప్రకటించినట్లు పేర్కొన్నారు.
లొంగిపోయిన వారి పేర్లు..
తమ ఎదుట లొంగిపోయిన వారిలో తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ అడ్లూరి ఈశ్వరి సైతం ఉన్నట్లు డీజీపీ స్పష్టం చేశారు. అలాగే ఆవులం సోమా, సుశీల, వేముల రాజు, నందయ్య, మంకు ఇలా పలువురు ఆయుధాలు వదిలిపెట్టారని తెలియజేశారు. అడ్లూరి ఈశ్వరి నుంచి రెండు మిషన్ గన్స్ (LMG) స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
భారీగా ఆయుధాలు స్వాధీనం
మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల వివరాలను సైతం డీజీపీ శివధర్ రెడ్డి వివరించారు. 8 ఏకే 47 తుపాకులు, 48 బ్యారెల్ గ్రానైడ్ లాంచర్స్, హెలికాఫ్టర్ ను సైతం కూల్చేసే సామర్థ్యమున్న ఆయుధాలను సీజ్ చేసినట్లు చెప్పారు. మావోయిస్టులకు చెందిన పీఎల్జీఏ బెటాలియన్ లో గతంలో 400 మంది ఉంటే ప్రస్తుతం 600 మంది మాత్రమే మిగిలారన్నారు. దీన్ని బట్టి పీఎల్జీఏ ఏ స్థాయిలో బలహీనపడిందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. తెలంగాణకు చెందిన రాజిరెడ్డి లొంగుబాటుతో ఇంకా ఒక్కరు మాత్రమే స్టేట్ కమిటీలో మిగిలారని చెప్పారు.
డీజీపీ ముందు లొంగిపోయిన 20 మంది మావోయిస్టు లు
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బరిసె దేవా, కంకనాల రాజిరెడ్డి సహా 20 మంది కీలక సభ్యులు లొంగిపోయారు. వీరి నుంచి 48 మౌంటెడ్ LMG ఆయుధాలు, 20 లక్షల నగదును పోలీసులు స్వాధీనం… pic.twitter.com/yq31OqdJnn
— ChotaNews App (@ChotaNewsApp) January 3, 2026
సీఎం రేవంత్ పిలుపుతో..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతోనే పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. సీఎం పిలుపుతో వారంతా ఆత్మ సమర్పణ చేసుకున్నారన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం రివార్డ్ సైతం అందించనున్నట్లు తెలిపారు. డివిజన్ సభ్యులకు రూ. 5 లక్షలు, ఏరియా సభ్యులకు రూ.4 లక్షలు, ఇతరులకు రూ.1 లక్ష చొప్పున రివార్డు ఇస్తామన్నారు. మెుత్తం రూ.1.80 కోట్లను వారికి అందజేస్తామన్నారు. అయితే తక్షణ సాయం కింద ప్రస్తుతం రూ.లక్ష ఇస్తామని డీజీపీ స్పష్టం చేశారు.
Also Read: Sleeping Pods: రైల్వే గుడ్ న్యూస్.. రైలు వచ్చే వరకు ఎంచక్క అక్కడ పడుకోవచ్చు!
576 మంది లొంగుబాటు..
ఇప్పటివరకూ మెుత్తంగా 576 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి తెలియజేశారు. పీఎల్జీఏ ఇచ్చిన సమాచారం ప్రకారం.. మావోయిస్టు సభ్యుల్లో 17 మంది మాత్రమే తెలంగాణ వారు మిగిలి ఉన్నట్లు తెలిపారు. సెంట్రల్ కమిటీలో ఐదుగురు, స్టేట్ కమిటీలో నలుగురు పని చేస్తున్నట్లు చెప్పారు. వారు కూడా లొంగిపోవాలని ఈ సందర్భంగా డీజీపీ పిలుపునిచ్చారు.

