Sheep Distribution Scam: సంచలనం సృష్టించిన గొర్రెల స్కాంలో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి ఓఎస్డీని ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో గొప్పగా చెప్పుకొని గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, దీంట్లో 700కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందంటూ ఏసీబీ(ACB) అధికారులు నిర్ధారించారు. ఈ క్రమంలో పశు సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రాంచందర్ నాయక్(Ramchander Nayak)తో పాటు స్కీంలో నోడల్ ఆఫీసర్లుగా పని చేసిన పలువురు అధికారులను అరెస్ట్ చేశారు.
Also Read: KCR: బీఆర్ఎస్ ముఖ్య నేతల భేటీలో మాజీ సీఎం కేసీఆర్
కీలక డాక్యుమెంట్లను స్వాధీనం
ఆ సమయంలోనే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav)వద్ద ఓఎస్డీగా పని చేసిన కళ్యాణ్ను కూడా అరెస్ట్ చేశారు. కాగా, బుధవారం ఈడీ అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉన్న రాంచందర్ నాయక్, (Ramchander Nayak)కళ్యాణ్ నివాసాలతోపాటు మొత్తం ఎనిమిది చోట్ల తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణ్ ఇంటి నుంచి పెద్ద మొత్తంలో నగదును కూడా సీజ్ చేసిన ఈడీ అధికారులు సోదాలు ముగిసిన తరువాత ఆయనను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు విచారించిన అనంతరం ఇంటికి పంపించి వేశారు. కాగా, మరోసారి కళ్యాణ్ను పిలిపించి ఈడీ అధికారులు విచారణ చేయడం గమనార్హం. ఇక, కళ్యాణ్ గురువారం రాత్రి వరకు కూడా తన ఇంటికి చేరుకోలేదని తెలిసింది. ఈ క్రమంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారంటూ ప్రచారం జరిగింది. అయితే, దీనిపై ఈడీ అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
Also Read: Deva Katta: ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రయాణం.. ‘మయసభ’ అందరి ఆస్తిలా మారిపోతోంది