తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Telangana Gig workers: గిగ్ వర్కర్లతో పాటు ప్లాట్ఫామ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, హక్కుల కల్పన, బీమా సౌకర్యాన్ని తేవాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే ఈ సెక్షన్ ప్రజలకు రూ. 5 లక్షల ప్రమాద బీమా కల్పించి గుర్తింపు పొందగా ఇప్పుడు ఏకంగా చట్టాన్నే తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. గిగ్ వర్కర్ల యూనియన్ ప్రతినిధులతో పాటు కార్మిక శాఖ సహా పలు విభాగాల అధికారులతో సచివాలయంలో రివ్యూ చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 25లోగా ముసాయిదా బిల్లును రూపొందించాలని, ప్రజలకు అందుబాటులో ఉంచి అభిప్రాయాలను తీసుకోవాలని, వాటిని పరిశీలించిన తర్వాత తుది బిల్లును తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.
మే దినోత్సవం రోజున లాంఛనంగా చట్టంగా అమల్లోకి తేవాలన్న ప్రణాళికలను వివరించారు. గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లకు భద్రత కల్పించేలా బిల్లు ముసాయిదా డాక్యుమెంట్ను వెంటనే ప్రజాభిప్రాయానికి అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ నొక్కిచెప్పారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదాను ఆఫీసర్లు రూపొందించాలని సూచించారు. గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా సదుపాయం, ఇతర హక్కులను కల్పించేలా రాష్ట్ర కార్మిక శాఖ ‘తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ బిల్లు’ చిత్తు ముసాయిదా (రఫ్ డ్రాఫ్ట్)ను రూపొందించిన అధికారులు అందులో పొందుపరిచిన అంశాలను ముఖ్యమంత్రికి ఈ సమావేశంలో వివరించారు.
దీనికి ఆయన కొన్ని మార్పులు చేర్పులను సూచించారు. కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు కంపెనీలు, అగ్రిగేటర్లకు మధ్య సమన్వయం, సుహృద్భావం ఉండేలా ఈ చట్టం ఉపయోగపడాలన్నారు. ఈ బిల్లు ముసాయిదాను వెంటనే ఆన్లైన్లో అందుబాటులో ఉంచి, ప్రజాభిప్రాయాన్ని సేకరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ, క్యాబ్స్ డ్రైవర్లు, ప్యాకేజ్ డెలివరీల్లో దాదాపు నాలుగు లక్షల మంది గిగ్ వర్కర్లు పని చేస్తున్నారని, అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించాలని సూచించారు.
Also Read: Meenakshi Natarajan on Rajgopal: రచ్చరేపిన రాజగోపాల్రెడ్డి.. రంగంలోకి మీనాక్షి నటరాజన్?
వీటితో పాటు అధికారులు ఈ ముసాయిదాలో పొందుపరిచిన అంశాలపై తుది కసరత్తు చేయాలని, అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఈ నెల 25వ తేదీ నాటికి బిల్లు తుది ముసాయిదాను సిద్ధం చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసే అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మే డే రోజున ఈ బిల్లును అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ వర్కర్ల భద్రతకు చట్టం తెస్తామని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
దేశంలోనే మొదటి సారిగా గిగ్ వర్కర్లకు ప్రమాద బీమాను అమలు చేసిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లు మరణిస్తే ఆ కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల ప్రమాద బీమాను అందించేలా 2023 డిసెంబర్ 30న ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్తగా రూపొందించనున్న చట్టం కూడా దేశానికి మార్గదర్శకంగా ఉండాలని సూచించారు.
ఈ సమావేశంలో గిగ్ వర్కర్లు, యూనియన్ల ప్రతినిధులు, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్ళులు రామకృష్ణారావు, జయేష్ రంజన్, సంజయ్ కుమార్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: Brs social media: నాడు వద్దన్నారు.. నేడు దీన్నే చదవమంటున్నారు.. అసలు ఎంటది?