Telangana Tourism: తెలంగాణ పర్యాటక శాఖ 2025 సంవత్సరంలో సాధించిన అద్భుత ప్రగతిని, 2026 లక్ష్యాలను అధికారులు బుధవారం వెల్లడించారు. ఎకో (పర్యావరణ), మెడికల్ (వైద్య), హెరిటేజ్ (వారసత్వ), స్పిరిచువల్ (ఆధ్యాత్మిక), రూరల్ అండ్ ట్రైబల్ (గ్రామీణ, గిరిజన), సినిమా, వెడ్డింగ్ డెస్టినేషన్, స్పోర్ట్స్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించి ‘తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030’ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఈ నూతన విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు వివరించారు. టూరిజం కాంక్లేవ్ 2025 ద్వారా 30 ప్రాజెక్టులకు గానూ రూ.15,279 కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి, తద్వారా సుమారు 50,000 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దీనికి అదనంగా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ద్వారా మరో రూ. 7,045 కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఇవి మరో 40,000 ఉద్యోగాల సృష్టికి దోహదపడనున్నాయి. ముఖ్యంగా ఫుడ్లింక్ గ్లోబల్ సెంటర్ (రూ.3,000 కోట్లు), సారస్ ఇన్ఫ్రా (రూ. 1,000 కోట్లు), స్మార్ట్ మొబిలిటీ (రూ. 1,000 కోట్లు) వంటి అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకు రావడం గమనార్హం.
మౌలిక సదుపాయాలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 123 పర్యాటక ప్రాజెక్టులలో ఇప్పటికే 78 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలైన స్వదేశ్ దర్శన్ 2.0, ప్రసాద్ కింద రూ. 275 కోట్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. అనంతగిరి కొండల్లో ఎకో-టూరిజం, భువనగిరి కోట వద్ద ఎక్స్పీరియెన్షియల్ జోన్లను అభివృద్ధి చేస్తున్నారు. జల పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ హుస్సేన్ సాగర్లో 120 మంది ప్రయాణించగల ‘ముచుకుంద’ అనే డబుల్ డెక్కర్ బోటును అందుబాటులోకి తెచ్చారు. ఇక హైదరాబాద్లో నిర్వహించిన ప్రపంచ సుందరి వేడుకలు నగరాన్ని గ్లోబల్ డెస్టినేషన్గా నిలబెట్టాయి. 110 దేశాల సుందరీమణులు మన పర్యాటక ప్రాంతాలకు రాయబారులుగా మారి ప్రచారం చేయడం విశేషం.
Also Read: Shivaji Statue: రాయపర్తిలో కలకలం.. ఛత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు
గిన్నిస్ రికార్డులు – భద్రత
బతుకమ్మ పండుగను ప్రపంచ వేదికపై నిలబెడుతూ 19.44 మీటర్ల అతిపెద్ద బతుకమ్మ, 1,354 మంది మహిళలతో జానపద నృత్యం ప్రదర్శించి సెప్టెంబర్ 29, 2025న రెండు గిన్నిస్ రికార్డులు సాధించినట్లు అధికారులు సగర్వంగా ప్రకటించారు. పర్యాటకుల భద్రత కోసం 80 మంది ప్రత్యేక శిక్షణ పొందిన అధికారులతో అక్టోబర్ 13, 2025న ప్రారంభించిన టూరిస్ట్ పోలీస్ వ్యవస్థ అద్భుత ఫలితాలను ఇస్తోంది. పర్యాటకుల కోసం యూనిఫైడ్ ఆన్లైన్ పోర్టల్, డిజిటల్ ట్రావెల్ కార్డులను కూడా ప్రవేశపెట్టారు.
2026 లక్ష్యాలు ఇవే..
రాబోయే 2026 సంవత్సరానికి పర్యాటక శాఖ స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నది. ‘హైదరాబాద్-సోమశిల-శ్రీశైలం సర్క్యూట్లో హెలీ టూరిజం సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడం. నాగార్జున సాగర్, సోమశిల, బస్వాపూర్ ప్రాంతాలను అత్యుత్తమ వెడ్డింగ్ డెస్టినేషన్లుగా తీర్చిదిద్దడం. హైదరాబాద్ను గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్గా మార్చేందుకు ప్రత్యేక సొసైటీ స్థాపన. జనవరి 13 నుంచి 15 వరకు అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించడం టూరిజం శాఖ టార్గెట్. తెలంగాణ పర్యాటక రంగం కేవలం వినోదానికే పరిమితం కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా, స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించే వనరుగా మారుతోంది’ అని అధికారులు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో, మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) దిశానిర్దేశంలో తెలంగాణ పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారుతోందని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్లపై గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి షురూ.. పొంగులేటి కీలక ప్రకటన

