Telangana Jobs: ప్రభుత్వ హాస్పిటల్స్లో ఖాళీల భర్తీ ప్రక్రియ శరవేగంగా జరుగుతున్నది. ఇటీవలే 1,257 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిన మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ను శనివారం విడుదల చేసింది. రాత పరీక్షకు హాజరైన ప్రతి అభ్యర్థి సాధించిన మార్కులు, ఇతరత్రా వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. మొత్తం 2,322 పోస్టులకుగానూ 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ లిస్టులో ఉన్న వారికి ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి, అనంతరం సెలక్షన్ లిస్ట్ విడుదల చేయనున్నారు. వెంగళరావు నగర్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుండగా, ఎవరెవరు ఎప్పుడు రావాలనే వివరాలను వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని అభ్యర్థులకు బోర్డు సూచించింది. 2024లో 6,956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మరో 2,322 పోస్టులను భర్తీ చేస్తున్నది. దీంతో ప్రభుత్వ హాస్పిటల్స్లో నర్సింగ్ ఆఫీసర్ల కొరత పూర్తిగా తీరిపోనున్నది.
రికార్డ్ స్థాయిలో నియామకాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి దామోదర్ రాజనర్సింహ బాధ్యతలు చేపట్టిన తర్వాత రికార్డ్ స్థాయిలో 9,572 పోస్టుల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం భర్తీ పూర్తయిన వాటితో సరిపెట్టుకోకుండా, 2026లో మరో 7,267 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది. ఇందులో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్), స్పెషలిస్ట్ డాక్టర్లు (టీవీవీపీ), ఫార్మసిస్టులు(గ్రేడ్ 2), అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, తదితర పోస్టులు ఉన్నాయి.
Also Read: Jobs in Telangana: ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ పోస్టుల భర్తీకి వేగం
18 వేలకుపైగా ఖాళీలు
ప్రభుత్వ హాస్పిటల్స్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నది రేవంత్ సర్కార్ లక్ష్యం. ఇప్పటివరకు భర్తీ చేసినవి, ప్రస్తుతం ప్రక్రియలో ఉన్నవి కలిపి ఈ ఏడాది జూన్ నాటికి సుమారు 16,839 పోస్టులు భర్తీ కానున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ సర్కార్, 2020లో కోవిడ్ వచ్చే వరకూ అసలు ప్రభుత్వ వైద్య వ్యవస్థను పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. కోవిడ్లో ప్రభుత్వ హాస్పిటల్స్ డొల్లతనాన్ని ప్రజలు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టడం, ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో చివరి మూడు సంవత్సరాలు అప్గ్రెడేషన్కు భారీగా జీవోలు ఇచ్చారు. అక్కడక్కడ కొత్త భవనాల నిర్మాణ పనులను మొదలు పెట్టి, పూర్తి చేయలేకపోయారు. ఇక డాక్టర్లు, సిబ్బంది నియామకాల సంగతి అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. వెరసి 2023 డిసెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి, ప్రభుత్వ హాస్పిటల్స్లో ఖాళీ పోస్టుల సంఖ్య 18 వేలు దాటింది. అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఆరోగ్యశాఖ మంత్రిగా సీనియర్ నాయకుడు దామోదర్ రాజనర్సింహ బాధ్యతలు తీసుకున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో ఖాళీలు అన్నీ భర్తీ చేస్తేనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించగలమని ఆయన భావించి, భర్తీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
జూన్ నాటికి 16 వేల పోస్టుల భర్తీ
మంత్రి దామోదర్ పర్యవేక్షణ, వరుస రివ్యూలు, కోర్టు కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాటిని క్లియర్ చేయించడంతో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగంగా జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చేయనన్ని పోస్టులను రెండేళ్లలో ఆరోగ్య శాఖలో భర్తీ చేయడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి 18 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉండగా, ఈ ఏడాది జూన్ నాటికి 16,839 భర్తీ ప్రక్రియ పూర్తవుతున్నది. అనంతరం మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నది. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంల నుంచి మొదలుకొని స్పెషలిస్ట్ డాక్టర్ల వరకు అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తుండడంతో ప్రభుత్వ వైద్య సేవలు మరింత బలోపేతం కానున్నాయి.
Also Read: Telangana Police Jobs: నిరుద్యోగులు రెడీగా ఉండండి.. తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల జాతర

