Seethakka: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సంబంధించి టెండర్లు తక్షణమే పిలవాలని మంత్రులు సీతక్క, (Seethakka) కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. బుధవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మేడారం అభివృద్ధి ప్రణాళిక సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేయడంతో కౌంట్డౌన్ ప్రారంభమైందని, ఇది ఒక మహాఘట్టం.. ఈ చరిత్రాత్మక పనిలో మీరు అందరూ భాగమవుతున్నారు.
Also Read: GHMC: పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు.. బల్దియా బాస్ ఫుల్ సీరియస్
మేడారం కీర్తి వెయ్యేళ్లు నిలిచేలా అభివృద్ధి పనులు ఉండాలి
ఈ కృషి శాశ్వతంగా నిలుస్తుందన్నారు. మేడారం కీర్తి వెయ్యేళ్లు నిలిచేలా అభివృద్ధి పనులు ఉండాలని, భక్తులకు ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యాల కోసం మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మేడారం అభివృద్ది ప్రణాళికలకు సంబంధించి వర్కింగ్ డ్రాయింగ్స్, స్ట్రక్చరల్ డిజైన్స్ను అత్యంత వేగంగా పూర్తి చేయాలని, తదనుగుణంగా పనుల అంచనాలను సిద్ధం చేసి టెండర్లు తక్షణమే పిలవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్, పంచాయతీ రాజ్ ఈఎన్సీ ఎన్. ఆశోక్, దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
సీతక్క హర్షం
ఐటీడీఏ ఏటూరు నాగారం, ఐటీడీఏ ఉట్నూరు ల నూతన భవనాల నిర్మాణం కోసం రూ. 15 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ కావటంపై మంత్రి ధనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. శిథిలావస్థలో ఉన్న ఆ రెండు భవనాల స్థానంలో అధునాతన సదుపాయాలతో భవనాలు నిర్మించాలని, అనుగుణంగా నిధులు మంజూరు చేయాలని సీఎం, సీఎం డిప్యూటీ సీఎం ను విజ్ఞప్తి చేశారు. తాజాగా ఐటీడీఏ ఉట్నూరు నూతన భవన నిర్మాణం కోసం 15 కోట్లు, ఐటీడీఏ ఏటూరు నాగారం నూతన నిర్మాణం కోసం రూ.15 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు, నిధుల మంజూరుకు సహకరించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Visa Free Countries: వీసాతో పని లేని 7 పర్యాటక దేశాలు.. ఒక్కసారి వెళ్లారో అక్కడే సెటిల్ అవుతారు!