Telangana Temples: రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుడుతుంది. ప్రధాన ఆలయాల్లో ఆధ్యాత్మిక ప్రదేశాల అభివృద్ధికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. పది ఆలయాలకు రూ.2200కోట్లు, 1979 ఆలయాలకు సీజీఎఫ్(CGF) నిధులు రూ.779.74కోట్లతో అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. ఈ నిధులను నాలుగు విడుతల్లో విడుదల చేసి ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఆలయాలకు భక్తుల రద్దీని పురస్కరించుకొని భవిష్యత్ కు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించింది.
భవిష్యత్ లో భక్తుల రద్దీ
రాష్ట్రంలోని పలు ఆలయాల్లో పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. భద్రాచలం(Bhadrachalam), జోగులాంబ(Jogulamba), బాసర(Basara) సహా 10 ప్రధాన దేవాలయాల అభివృద్ధికి రూ.2,202.35 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. అందుకోసం ఆయా ఆలయాల వద్ద రహదారుల విస్తరణ, అన్నదాన సత్రాలు, వసతిగృహాలు క్యూలైన్, కాంప్లెక్స్ లు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం, విద్యుత్ లైట్లు, శాశ్వతంగా ఉండేలా మంటపాలు ఏర్పాటు చేయబోతున్నారు. భవిష్యత్ లో భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తరణ పనులు చేపడుతున్నారు.
అందుకోసం మాస్టర్ ప్లాన్ ను దేవాదాయశాఖ సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం, బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, కొడంగల్ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం, ఆలంపూర్ లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయం, కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయం, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, చెర్వుగట్టు పార్వతీజడల రామలింగేశ్వరస్వామి ఆలయంను ఎంపిక చేశారు. నాలుగు విడుతల్లో నిధులు విడుదల చేయబోతున్నారు.
రూ.350 కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు
భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని మూడు దశల్లో రూ.350 కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్లాన్ సిద్ధం చేశారు. వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి దేవస్థానం(Rajarajeshwara Swamy Temple in Vemulawada) అభివృద్ధి కోసం రూ.696.25 కోట్లు, అలంపూర్లోని జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి దేవస్థానం(Balabrahmeshwara Swamy Temple)కు రూ.345 కోట్లు, కీసరలోని రామలింగేశ్వరస్వామి ఆలయ(Ramalingeswara Swamy Temple) నికి రూ.202 కోట్లు, కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయా(Kaleshwara Mukteshwara Swamy Temple)నికి రూ.200 కోట్లు, బాసరలోని జ్ఞానసరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూ.189.10 కోట్లు , కొడంగల్లోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.110 కోట్లు, చెర్వుగట్టులోని పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి కోసం రూ.110 కోట్ల ఖర్చవుతుందని అధికారులు అంచనాలు రూపొందించారు. ఇందులో వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ.696.25 కోట్లతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. ఈ దేవాలయాన్ని మొత్తం నాలుగు దశల్లో అభివృద్ధి చేస్తారు. మిగిలిన ఆలయాలతో పాటు ములుగు సమ్మక్క సారక్క వద్ద అభివృద్ధి పనులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ లను సీఎం రేవంత్ రెడ్డికి పంపినట్లు సమాచారం. సీఎం ఆమోదించిన వెంటనే పనులను ప్రారంభించనున్నారు.
Also Read: Bigg Boss Telugu 9 : బిస్బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్న ఆరుగురు కామన్ మ్యాన్స్..
7.86కోట్లతో 24 ఆలయాలు
అదే విధంగా సీజీఎప్(సర్వశ్రేయోనిధి), ఇతర శాఖల నిధులు మొత్తం 779.74కోట్లతో ఆలయాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. సీజీఎఫ్ ఎయిడ్ నిధులు 502.17కోట్లను 1979 ఆలయాలను ఎంపిక చేశామని వాటిలో అభివృద్ధి చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఎస్డీఎఫ్(SDF) వర్క్స్ 64.46కోట్లతో 48 ఆలయాలు, ఆర్ అండ్ ఆర్(R&R) వర్క్స్ కింద 7.86కోట్లతో 24 ఆలయాలు, రూ.111.25కోట్లతో ఎంఏయూడీ, శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం(వేములవాడ), రూ.50కోట్లతో జ్ఞానసరస్వతీ ఆలయం(బాసర), సీతారామచంద్రస్వామి ఆలయం(భద్రాచలం) రూ.34కోట్లు, లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం(కొడంగల్) రూ.30కోట్లతో పనులు చేపడుతున్నారు.
ప్రతి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం
రాష్ట్రంలోని ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. తొలుత 10 ప్రధాన ఆలయాల్లో 2200కోట్లు పనులు చేపడుతున్నాం. సీజీఎఫ్ నిధులు 779.74కోట్లతో మరో 1979ఆలయాలను ఎంపిక చేసి భక్తుల సౌకర్యార్ధం వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే వరంగల్ (తూర్పు) నియోజకవర్గంలోని 6 దేవాలయాలకు 4.35 కోట్లతో నిర్మించే పనులకు శంకుస్థాపన చేశాం. అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం. ప్రణాళికబద్దంగా ఆలయాల్లో నిర్మాణాలు చేపడుతున్నాం. దశలవారీగా అన్ని ఆలయాల అభివృద్ధి, నవీకరణ, పునరుద్ధరణ చేపడతాం.
Also Read: Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు