Sarkar Labs Drive: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘సర్కార్ ల్యాబ్స్’ డ్రైవ్ నిర్వహించనున్నది. ఈ డ్రైవ్లో ల్యాబ్ క్వాలిటీ చెక్ చేయనున్నారు. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబరేటరీస్ ప్రమాణాలకు అనుగుణంగా ల్యాబ్స్ ఉన్నాయా? లేదా? అని చెక్ చేయనున్నారు. ఆయా ల్యాబ్స్లో పనిచేసే టెక్నిషియన్స్ స్కిల్స్ను కూడా పరీక్షించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం ఎక్స్ పర్ట్స్, సీనియర్లతో ఓ కమిటీ ఏర్పాటు దిశగా సర్కార్ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రులు, తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలు తదితర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ల్యాబ్స్ను ఈ కమిటీ పరిశీలించనున్నది. ఈ మేరకు సర్కార్ నుంచి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది.
వైద్యంలో నో కాంప్రమైజ్..
ప్రభుత్వ వైద్యం అంటే కేవలం మందులు ఇవ్వడమే కాదు.. రోగ నిర్ధారణలోనూ రాజీ పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ల్యాబ్ నెట్వర్క్ను బలోపేతం చేస్తున్నది. రోగులకు నాణ్యమైన పరీక్షలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా చికిత్స ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్ఏబీఎల్ స్టాండర్స్ పాటిస్తూ ప్రైవేట్ ల్యాబ్లకు దీటుగా పరీక్షలు, రిపోర్ట్లు జరగాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే పకడ్భందీగా నిర్వహిస్తున్నప్పటికీ, మరింత అడ్వాన్స్డ్ సిస్టమ్ను తీసుకురావాలని సర్కార్ ఈ విధానాన్ని అమలు చేయనున్నది. ఇక కేవలం పరీక్షలు చేయడం మాత్రమే కాకుండా, వాటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రతిరోజూ మిషన్ల పనితీరును పరీక్షించిన తర్వాతే రోగుల శాంపిల్స్ సేకరించడం, ల్యాబ్ రిపోర్ట్ల కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి అప్పుడప్పుడు శాంపిల్స్ను ఇతర ఉన్నత స్థాయి కేంద్రాలకు పంపి క్రాస్ వెరిఫికేషన్ చేసే ప్రక్రియకు ఓ మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేయనున్నారు.
Also Read: Illegal Constructions: ఎల్లంపేటలో ఆక్రమ నిర్మాణాలు.. అధికారుల తీరు ఎలా ఉందంటే?
స్టాఫ్ స్కిల్ సైతం..
వైద్యం కేవలం మందులతోనే కాదు, మాట్లాడే తీరుతోనూ సగం నయమవుతుంది. అందుకే ఈ ల్యాబ్స్లో పనిచేసే టెక్నీషియన్లు, సిబ్బందికి సాఫ్ట్ స్కిల్స్పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. రోగులతో మర్యాదగా ప్రవర్తించడం, పరీక్షల వివరాలను అర్థమయ్యేలా వివరించడం, ఒత్తిడి సమయంలోనూ సహనంతో వ్యవహరించడం వంటి వాటిపై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇక సీనియర్ టెక్నిషియన్లతో జిల్లా కేంద్రాల్లోని ల్యాబ్ స్టాఫ్కు ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇవ్వాలని వైద్యారోగ్యశాఖ ఆలోచిస్తున్నది. దీంతో పాటు సర్కార్ ల్యాబ్స్ డ్రైవ్ ద్వారా అన్ని రిపోర్ట్లను ఆన్లైన్లో మరింత వేగంగా అందించేందుకు ప్రయత్నం చేయనున్నారు. రోగి మొబైల్కే నేరుగా రిపోర్ట్లు పంపడం, డాక్టర్లు తమ సిస్టమ్లోనే రిపోర్ట్లు చూసి మందులు సూచించేలా సాంకేతికతను జోడించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని దవాఖాన్లలో కొనసాగుతున్నా.. మరింత పకడ్భందీగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ఎందుకీ నిర్ణయం..?
గతంలో రోగి లక్షణాలను బట్టి వైద్యం అందించే డాక్టర్లు.. ఇప్పుడు రిపోర్ట్ లేనిదే చికిత్స మొదలు పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్.. ఇలా ఏ స్థాయి దవాఖాన్లకు వెళ్లినా ఇదే పరిస్థిని నెలకొన్నది. దీంతోనే సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నది. అంతేగాక ఇటీవల కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొంత మంది పేషెంట్ల రిపోర్ట్లు తప్పుల తడక వచ్చాయని ఆయా ఆస్పత్రుల వద్ద ఆందోళనలు జరిగాయి. ల్యాబ్స్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా వైద్యం అందించే పరిస్థితుల్లో ఈ రిపోర్ట్ వంద శాతం ఆక్యురేట్గా ఉండాలంటే.. ప్రభుత్వం మరిన్ని స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేయాలని భావిస్తున్నది. తొలుత ప్రభుత్వ ల్యాబ్స్ను చక్కదిద్ది ఆ తర్వాత ప్రైవేట్ ల్యాబ్ల పరిస్థితిని అబ్జర్వ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సచివాలయంలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
Also Read: Minister Sridhar Babu: మా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలు పుష్కలం: మంత్రి శ్రీధర్ బాబు

