Telangana Districts: ప్రస్తుతం కొనసాగుతున్న రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిపాలనపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రాలు జనావాసాలకు దూరంగా, అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండటంతో సామాన్య ప్రజలు కార్యాలయాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా(Rangareddy district) భౌగోళిక స్వరూపానికి, పరిపాలన విధానంలో అనేక మార్పులున్నాయి. పూర్తిగా అర్బన్, గ్రామీణ ప్రాంతాలుండే జిల్లా కాదు. మొన్నటి వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా భౌగోళిక పరిస్థితి విచిత్రంగా ఉంది. హైదరాబాద్ చుట్టుముట్టూ రంగారెడ్డి జిల్లా విస్తరించి ఉండేది. గత ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన చేయడంతో వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల ప్రజలకు వికారాబాద్జిల్లాతో ఉపశమనం జరిగింది.
అదే పద్దతిలో మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలో అర్బన్, మినీ అర్బన్, రూరల్ ప్రాంతాలుండేవి. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడంపై కూడా అసంతృప్తి నెలకొంది. ప్రస్తుత ప్రభుత్వం ఔటర్ రింగు రోడ్డును హద్దుగా చేసుకుని అనేక మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే పోలీసు కమిషనరేట్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం వంటి నియోజకవర్గాలు మూడు వేర్వేరు కమిషనరేట్ల పరిధిలోకి వెళ్లడం వల్ల స్థానికంగా గందరగోళం నెలకొంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు, పోలీసు కమిషనరేట్ల హద్దులకు అనుగుణంగానే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మార్పుల ద్వారా పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలని సర్కార్ భావిస్తోంది.
కమిషనరేట్ల బాటలోనే జిల్లాల హద్దులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి విస్తరణ నేపథ్యంలో, పరిపాలనను మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా 27 పురపాలక సంఘాలను గ్రేటర్లో విలీనం చేయడం, డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కి పెంచే ప్రక్రియ సాగుతున్న తరుణంలో, జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం తెరపైకి వచ్చింది. ప్రధానంగా రెవెన్యూ శాఖ, కార్పొరేషన్, పోలీస్ కమిషనరేట్ల పరిధులు వేర్వేరుగా ఉండటం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న గందరగోళానికి చెక్ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ సిటీ, సైబరాబాద్, మేడ్చల్ పోలీస్ కమిషనరేట్ల హద్దులకు సమాంతరంగానే హైదరాబాద్, రంగారెడ్డి (సైబరాబాద్), మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ప్రజలకు పనులు సులభతరం
దీనివల్ల పోలీస్ స్టేషన్ పరిధి, రెవెన్యూ మండలం, కలెక్టరేట్ పరిధి ఒకే విధంగా ఉండి, ప్రజలకు పనులు సులభతరం అవుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిని ఒక ప్రత్యేక జిల్లాగా రంగారెడ్డి రూరల్ లేదా జైపాల్ రెడ్డి/బూర్గుల రామక్రిష్ణారావు పేరుతో జిల్లా మార్చాలనే డిమాండ్లు, ప్రతిపాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనివల్ల ఐటీ కారిడార్తో కూడిన అర్బన్ ప్రాంతాలకు, గ్రామీణ స్వరూపం కలిగిన మండలాలకు మధ్య పరిపాలనా వ్యత్యాసం తగ్గి, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టే వీలుంటుంది. కేవలం అంకెల్లో కాకుండా, ప్రజల సౌలభ్యం కోసం అసెంబ్లీ నియోజకవర్గాల హద్దులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్థానిక నేతలు కోరుతున్నారు.
జిల్లాల పేర్లపై ఆసక్తికర చర్చ
ప్రస్తుతం కొనసాగుతున్న రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కేంద్రాలు ప్రజలకు ఏమాత్రం అందుబాటులో లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఇబ్రహీంపట్నం-మహేశ్వరం సరిహద్దులో ఉండటంతో, దూరంగా ఉండే చేవెళ్ల, షాద్నగర్ ప్రజలకు ఇది శాపంగా మారింది. మరోవైపు శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ వంటి అర్బన్ ప్రాంతాలకు కూడా ఈ వ్యవస్థతో సరైన అనుసంధానం లేకుండా పోయింది. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. రవాణా సౌకర్యాలు లేని చోట కార్యాలయాలు ఉండటంతో, సామాన్యులు తమ సమస్యల పరిష్కారం కోసం రోజంతా వెచ్చించాల్సి వస్తోంది. ఈ దమనీయ పరిస్థితి వల్ల ప్రజలు బ్రోకర్లను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందనే ఆరోపణలు వస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ
ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణను ప్రతిపాదిస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిని ఒక జిల్లాగా మార్చాలంటే, కేవీ రంగారెడ్డి స్వగ్రామం ఉన్న మొయినాబాద్తో పాటు చేవెళ్ల, శంకర్పల్లి మండలాలను ఫ్యూచర్ సిటీ పరిధి నుంచి తొలగించి సైబరాబాద్లో కలపాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్యూచర్ సిటీ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తే, దానికి ‘రంగారెడ్డి’ అని పేరు పెడతారా? లేక మహనీయులు జైపాల్ రెడ్డి, బూర్గుల రామకృష్ణారావుల పేర్లను పరిశీలిస్తారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. కేవీ రంగారెడ్డి స్వగ్రామం ఉన్న మండలాన్ని సైబరాబాద్ జిల్లాలో విలీనం చేస్తే, మిగిలిన రూరల్ ప్రాంతాన్ని కొత్త పేర్లతో జిల్లాగా ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read: Rangareddy District: ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు విద్యార్థులు స్పాట్ డెడ్

