Telangana Temples: రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయడం, మరోవైపు మౌలిక వసతులు, అభివృద్ధి పనులను చేపడుతుండటంతో భక్తుల సంఖ్య పెరుగుతోంది. తద్వారా ఆదాయం సైతం గతం కంటే గననీయంగా పెరిగింది. గత ప్రభుత్వంలో ఒక దేవాలయం మినహా, అన్నింటినీ నిర్లక్ష్యం చేశారనే విమర్శలు వచ్చాయి. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని దేవాలయాలను సమగ్రంగా అభివృద్ధి చేయడంపై దృష్టిసారించింది. 2023 చివరి అంకంలో రాష్ట్రంలో ఉన్న 699 దేవాలయాల నుంచి రూ.373.55 కోట్లు ఆదాయం వస్తే, ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో రూ 2024లో రూ.544.61 కోట్లు వచ్చినట్టు దేవాదాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంటే, అదనంగా రూ.171.06 కోట్లు పెరిగింది. యాదాద్రికి సైతం ఆదాయం పెరిగింది. ఈ టెంపుల్కు గతేడాది ఆదాయం రూ.14.30 కోట్లుగా ఉండగా, ఇప్పుడు ఆదాయం రూ.17.62 కోట్లుగా ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.
అభివృద్ధిలో పరుగులు
రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మాస్టర్ ప్లాన్ రూపొందించి వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల్లో సుమారు రూ.450 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రెడీ అయింది. చెరువుగట్టు, కొండగట్టు, భద్రాచలం, వేములవాడ ఆలయాలకు భారీగా నిధులు కేటాయించింది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి 60 కిలోల బంగారు తాపడం పనులు జరుగుతున్నాయి. ఇందులో దేవస్థానం వద్ద నిల్వ ఉన్న 25 కిలోల బంగారంతోపాటు విరాళంగా వచ్చిన 35 కిలోల బంగారాన్ని వినియోగిస్తున్నారు. గోల్డ్ ప్లేటింగ్ తయారీ, ఫిక్సింగ్ ఛార్జీలకు కలిపి మొత్తం రూ.8 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది.
రానున్న బ్రహ్మోత్సవాల నాటికి ఈ పనులు పూర్తికానున్నాయి. ఇంకా 17 ఎకరాల్లో రూ.43.79 కోట్లతో వేదపాఠశాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. దీంతోపాటు వసతి గృహాన్ని ఏర్పాటు చేయడానికి 101 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భక్తుల వసతి కోసం కొండపై డార్మెటరీ హాల్ ఏర్పాటు చేశారు. వైటీడీఏకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించడంతోపాటు పరిపాలనలో పారదర్శకతకు పట్టం కట్టారు. వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.76 కోట్లు మంజూరు చేసింది. దీనిలో అన్నదానం సెంటర్ నిర్మాణానికి రూ.35.25 కోట్లు కేటాయించింది. బద్ది పోచమ్మ అమ్మవారి దేవాలయ అభివృద్ధి, గుడి చెరువు సుందరీకరణకు మరో రూ.20 కోట్లు మంజూరు చేసింది.
Also Read: Telangana Temples: భక్తులకు తప్పిన తిప్పలు.. రాష్ట్రంలో దేవాదాయ శాఖ కీలక నిర్ణయం..?
భద్రాచలానికి రూ.60.20 కోట్లు
భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయ అభివృద్ధిలో భాగంగా భూ సేకరణకు ప్రభుత్వం రూ.60.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇక, వరంగల్లోని భద్రకాళి అమ్మవారి దేవాలయ మాడవీధుల ఏర్పాటు, నిర్మాణానికి రూ.30 కోట్లు ప్రత్యేక అభివృద్ధి నిధులు, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) నిధుల నుంచి కేటాయించింది. మాడవీధుల పనులు పురోగతిలో ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కొడవటంచ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, దేవాలయ అభివృద్ధికి రూ.12.15 కోట్లు మంజూరు చేశారు.
మహబూబ్నగర్ జిల్లాలోని ప్రముఖ కురుమూరి జాతరకు సంబంధించిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే రూ.110 కోట్లతో కొండపైకి రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఖమ్మం జిల్లాలోని వైరా స్థానాల లక్ష్పురంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానం కల్యాణ వేదిక, అభిషేక మండపం, వసతి గృహాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.20 కోట్లు మంజూరు చేసింది. కామారెడ్డి జిల్లాలోని సలాబత్పూర్ శ్రీ మారుతీ మందిర్కు సంబంధించి రూ.6.70 కోట్లతో కల్యాణమండపం, ప్రకారమండపం, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధి జరుగుతోంది.
భక్తులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు: మంత్రి కొండా సురేఖ
‘‘గత ప్రభుత్వం కేవలం ఒక టెంపుల్ను మాత్రమే డెవలప్ చేసింది. మా ప్రభుత్వం వేములవాడ, భద్రాద్రి, కొండగట్టు, ధర్మపురి మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని చాలా దేవాలయాలను అభివృద్ధి చేస్తోంది. బాసర, కీసర, భద్రకాళి, ఐనవోలు, కొమురవెళ్లి ఇలా ఎన్నో టెంపుల్స్ను డెవలప్ చేస్తున్నాం. వాటి విస్తరణ పనులు జరుగుతున్నాయి. వీలైనంత వేగంగా పనులు చేపడుతున్నాం. టెంపుల్ పనులు పూర్తి చేసేదాకా మేం నిద్రపోము. ఆలయాలకు వచ్చే భక్తులకు మౌలిక సమస్యలు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నాం’’ అని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
Also Read: KCR: కవిత లొల్లితో కేసీఆర్కి చిక్కులు.. సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి..?

