Ponguleti Srinivas Reddy: రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఉన్నతమైన ప్రమాణాలతో నివసించేందుకు అనువైన సొంత ఇంటి వసతిని కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు అనువుగా ఉండే ధరల్లో ఉండేట్లుగా ఒక సమగ్ర విధాన రూపకల్పనకు తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ చక్కటి వేదిక అని ఆయన పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా అఫర్డ్ బుల్ హౌసింగ్ పాలసీ ఫర్ అర్బన్ ఫ్యూచర్-తెలంగాణ మోడల్ 2047 అనే అంశంపై జరిగిన సదస్సుకు మంత్రి హాజరై మాట్లాడారు.
పెరుగుతున్న పట్టణీకరణతో పాటు, విస్తృతమవుతున్న గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేశానికి ఆదర్శంగా ఉండేలా ఆర్థికంగా సాధ్యమైన, పర్యావరణ పరిరక్షణకు అనుగుణమైన, సాంకేతికత ఆధారిత అంశాలు ఉండేలా సమగ్రమైన పాలసీని రూపొందిస్తున్నామని వివరించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించనున్న విధానాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రోల్ మోడల్ గా నిలుస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు అమలైన గృహ కార్యక్రమాల ద్వారా సాధించిన పురోగతిని సైతం మంత్రి వివరించారు.
2047 వైపు చారిత్రక అడుగు
గతంలో ఇందిరమ్మ పథకం ద్వారా సుమారు 42 లక్షల ఇండ్లను నిర్మించగా, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమంలో సుమారు 3.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి తెలిపారు. అంతేకాకుండా మధ్య తరగతి కుటుంబాల కోసం హౌసింగ్ బోర్డ్, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తదితర సంస్థల ద్వారా సుమారు 1 లక్ష ఇళ్లు నిర్మించినట్లు వివరించారు. అయినా కూడా రాష్ట్రంలో గృహాల డిమాండ్, సరఫరా మధ్య భారీ అంతరం ఉందని, ఈ అంతరాన్ని పూడ్చడానికి, వ్యక్తిగత పథకాలకు పరిమితం కాకుండా, ప్రభుత్వ లక్ష్యానికి మూలస్తంభం లాంటి తెలంగాణ-2047ను ఆదాయంతో సంబంధం లేకుండా ఒక సమగ్ర గృహ నిర్మాణ విధానాన్నిరూపొందిస్తున్నామని పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. పట్టణ ప్రాంతాల అవసరాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, సమతుల్యతతో కూడిన ‘గృహ నిర్మాణ తెలంగాణ నమూనా 2047’ వైపు చారిత్రక అడుగు వేస్తున్నట్లు చెప్పారు.
సాంకేతికత ఆధారితంగా ఉండాలి
ఈ నమూనా తప్పనిసరిగా ఆర్థికంగా లాభదాయకంగా, సామాజికంగా సమ్మిళితంగా, బాధ్యతాయుతంగా, సాంకేతికత ఆధారితంగా ఉండాలని తమ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ప్రభుత్వ ప్రవేట్ భాగ్యస్వామ్యంతో ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలో పేద మధ్యతరగతి ప్రజల కోసం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ తరహాలో ఇళ్ల ను నిర్మించాలన్న ఆలోచన చేస్తున్నట్లు మంత్రి స్పష్టంచేశారు. తెలంగాణను మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజించి వ్యూహాలను రూపొందించామని తెలిపారు. అందులో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్, పరి-అర్బన్ రీజియన్, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో చిన్న, మధ్య తరహా టౌన్షిప్లు నిర్మించాలని నిర్ణయించారు.
రవాణా కారిడార్ల వెంబడి గృహాల ఏర్పాటు
తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతంలో మురికివాడల పునరాభివృద్ధి, ఐటీ కారిడార్లలో అందుబాటులో అద్దె గృహ నిర్మాణం, రవాణా కారిడార్ల వెంబడి గృహాల ఏర్పాటు ప్రధానంగా ఉండనున్నట్లు చెప్పారు. పరి-అర్బన్ ప్రాంతంలో ప్లాన్డ్ టౌన్షిప్లు అంటే భారత్ సిటీ వంటి గ్రీన్ఫీల్డ్ శాటిలైట్ టౌన్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికుల గృహ వసతి వంటివి నిర్మించనున్నారు. అలాగే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో చిన్న, మధ్య తరహా టౌన్షిప్లు ఏర్పాటుచేయనున్నారు. వీటిలో పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ హబ్లతో అనుసంధానించబడిన అద్దె, కార్మికుల గృహ నిర్మాణం ప్రధాన వ్యూహాలుగా తయారుచేసినట్లు మంత్రి పొంగులేటి స్పష్టంచేశారు.
అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమగ్రమైన అఫర్డ్ బుల్ హౌజింగ్ పాలసీ ఆవశ్యకత ఉందని ప్రభుత్వం గుర్తించిందని ఆయన తెలిపారు. కొత్తగా రూపొందించనున్న అఫర్డబుల్ హౌసింగ్ పాలసీలో ఇటీవల ప్రకటంచిన క్యూర్, ప్యూర్, రేర్ జోన్లకు అనుగుణంగా అనుసరించాల్సిన విధానాలను నిర్దేశించనున్నామని వెల్లడించారు. ఈ సెమినార్ లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధి అభిజిత్ శంకర్ రే, రాంకీ సీఎండీ నంద కిషోర్, హడ్ కో ఎండీ సురేశ్, క్రెడాయ్ ప్రెసిడెంట్ రాంరెడ్డి, ఏఎస్ బీఎల్ సీఈవో అజితేష్, సీబీఆర్ఈ ప్రతినిధి ప్రీతం మెహెరా తదితరులు పాల్గొన్నారు.

