Supreme Court: అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ రాజ్యాంగ బద్దతపై సుప్రీం కోర్టులో ఎటూ తేలలేదు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని జడ్జిలు వేర్వేరుగా అభిప్రాయాలు వెల్లడించారు. జస్టిస్ విశ్వనాథన్(Justice Viswanathan) ఈ సెక్షన్ ను సమర్థించగా జస్టిస్ నాగరాత్న(Justice Nagarathna) ఈ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దాంతో ఈ అంశాన్ని స్పెషల్ బెంచ్ కు బదిలీ చేసేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రభుత్వ అధికారులు విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలపై పోలీసులు విచారణ జరపాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అని చెబుతోంది. కాగా, ఈ సెక్షన్ చెల్లుబాటును సవాల్ చేస్తూ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీం కోర్టులో పిటిషన్ ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టు జడ్జిలు జస్టిస్ విశ్వనాథన్, జస్టిస్ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
ఇది రాజ్యాంగ బద్ధమే
ఈ క్రమంలో జస్టిస్ విశ్వనాథన్ తన తీర్పును వెలువరిస్తూ ఆత్మాభిమానం ఉన్న వ్యక్తికి అపఖ్యాతి కంటే మరణమే మేలు అని వ్యాఖ్యానించారు. నేటి సాంకేతిక, సోషల్ మీడియా యుగంలో ఒకసారి పరువు పోతే ఆ తరువాత నిర్దోషిగా తేలిగా ప్రయోజనం ఉండదన్నారు. అధికారులను వేధింపులకు గురి చేయకుండా సెక్షన్ 17ఏ అవసరమని వ్యాఖ్యానించారు. ఇది రాజ్యాంగ బద్ధమే అని పేర్కొన్నారు. కాగా, జస్టిస్ నాగరత్న తీర్పును వెలువరిస్తూ సెక్షన్ 17ఏ అవినీతికి పాల్పడుతున్న అధికారులకు రక్షణ కల్పిస్తోందని వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడే వారిపై ఎలాంటి దయాదాక్షిణ్యాలు చూపించాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి అధికారులను విచారించటానికి ముందస్తు అనుమతి అవసరం లేదని అభిప్రాయ పడ్డారు.
2018లో..
2018లో అవినీతి నిరోధక చట్టాన్ని సవరణ చేసిన కేంద్ర ప్రభుత్వం అందులో సెక్షన్ 17ఏను చేర్చింది. కక్షసాధింపు చర్యల నుంచి నిజాయితీగల అధికారులను రక్షించేందుకే ఈ సవరణ చేసినట్టు పార్లమెంట్లో ప్రకటించింది. 2018 తరువాత నమోదైన కేసులకే ఈ సెక్షన్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ సెక్షన్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి నమోదైన నేరాల్లో వారిని విచారించటానికి ముందస్తు అనుమతి తప్పనిసరి ప్రకటించింది. తప్పు చేసో.. అవినీతికి పాల్పడో ఎవరైన అధికారి దొరికితే సదరు ఉద్యోగిని పోస్టు నుంచి తొలగించే అధికారం ఉన్నవారి అనుమతి తీసుకుని విచారణ జరపాల్సి ఉంటుంది. ఇక, సదరు ఉన్నతాధికారి మూడు నెలల్లో తన నిర్ణయాన్ని వెల్లడించాలి. మరో నెల రోజులపాటు గడువును పొడిగించే అవకాశం ఉంటుంది. ఆ తరువాత అవినీతికి పాల్పడిన, తప్పు చేసిన అధికారులను విచారించాలా? లేదా? అన్నదానిపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలి.
Also Read: Damodar Raja Narasimha: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ శాఖలో 996 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్!

