తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : Notice TG Speaker Office: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పిటిషనర్ల తరపు న్యాయవాదులు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి వచ్చి నోటీసులు అందించారు. ఒక పార్టీ బీ-ఫామ్పై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయాన్ని సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా ఆదేశించింది. పిటషనర్ల తరఫు న్యాయవాదులకు కూడా ఆదేశాలు ఇచ్చి స్పీకర్ కార్యాలయంలో నోటీసులను అందజేయాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాల్లో భాగంగా పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్, పాటి కౌశిక్రెడ్డి తరఫున న్యాయవాదులు శనివారం అసెంబ్లీ సెషన్ జరుగుతుండగా స్పీకర్ కార్యాలయానికి వెళ్ళి ఈ నోటీసుల్ని అందజేశారు.
Also Read: Komatireddy Venkatreddy: కేసీఆర్ సారీ చెప్పాలి.. చిట్ చాట్ లో కోమటిరెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడాన్ని సవాలు చేస్తూ కేటీఆర్, కేపీ వివేకానందగౌడ్, పాడి కౌశిక్రెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఫిరాయింపు చర్యలకు పాల్పడినందున వీరిపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ కేటీఆర్ తన పిటిషన్లో సుప్రీంకోర్టును కోరారు. రాష్ట్ర హైకోర్టు ఇటీవల నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చినా వాటిని స్పీకర్ కార్యాలయం అమలు చేయడంలేదని, అందువల్ల ఆదేశించాలని వివేకానందగౌడ్, కౌశిక్రెడ్డి తదితరులు విడివిడి పిటిషన్లలో సుప్రీంకోర్టును కోరారు.
Delimitation JAC meeting:హైదరాబాద్లో రెండో సదస్సు.. రానున్న దక్షిణాది సీఎంలు!
వీటన్నింటినీ కలిపి గత వారం విచారించిన ధర్మాసనం… తదుపరి విచారణను 25వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిలోగా స్పీకర్ కార్యాలయం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. దానికి కొనసాగింపుగానే పిటిషనర్ల తరపు న్యాయవాదులు కూడా వెళ్లి నోటీసుల్ని అందజేయడం గమనార్హం. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు