TIMS Hospital: డిసెంబరు లో సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్(TIMS Hospital) ను ప్రారంభిస్తామని మంత్రి దామోదర రాజ నర్సింహ(Min Damodara Raja Narasimha) పేర్కొన్నారు.ఈ మేరక టిమ్స్ పనులను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ హాస్పిటళ్ల భవన నిర్మాణ పనులు, ఎక్విప్మెంట్స్ కొనుగోలుపై సెక్రటేరియట్లోని తన చాంబర్లో ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
నిర్మాణ పనులు చివరి దశలో..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టిమ్స్ హాస్పిటల్ ప్రారంభించిన రోజు నుంచే ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు. ఇందుకు అవసరమైన ఎక్విప్మెంట్, ఫర్నీచర్ అన్నీ ముందే సమకూర్చుకోవాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తుకు మంత్రి సూచించారు. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని నియమించుకోవాలని డీఎంఈ నరేంద్ర కుమార్(DME Narendra Kumar)ను ఆదేశించారు. సనత్నగర్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, అల్వాల్, ఎల్బీనగర్(LB Nagara) టిమ్స్ల పనులు మరో 6 నెలల్లో పూర్తి అవుతాయని అధికారులు మంత్రికి వివరించారు. సనత్నగర్ టిమ్స్ను ఈ ఏడాది చివరిలో ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(revanth Reddy) సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి గుర్తు చేశారు.
Also Read: Jupally Krishna Rao: మాదకద్రవ్యాల నివారణ అందరి బాధ్యత: మంత్రి జూపల్లి కృష్ణారావు
అధికారులను మంత్రి ఆదేశం
అక్టోబర్ చివరి నాటికల్లా అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్అండ్బీ, ఆరోగ్యశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆలస్యం కావొద్దన్నారు. ఎక్విప్మెంట్, ఫర్నీచర్ కొనుగోలు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్స్(Diagnostic Equipments) అన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడినవే కొనుగోలు చేయాలని సూచించారు. సంబంధిత డిపార్ట్మెంట్ డాక్టర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. నిమ్స్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్టు పనులపై మంత్రి ఆరా తీశారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కు హాస్టల్ సదుపాయం కూడా అక్కడే ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మహబూబాబాద్, మంచిర్యాల్, జనగాం, వనపర్తి మెడికల్ కాలేజీ భవనాలను మరో 2 నెలల్లో అప్పగిస్తామని ఆర్అండ్బీ అధికారులు వెల్లడించారు. మరో 8 నెలల్లో మిగిలిన కాలేజీల పనులను పూర్తి చేస్తామని తెలిపారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ ఫణీంద్రరెడ్డి, డీఎంఈ నరేంద్ర కుమార్, ఆర్అండ్బీ సీఈలు రాజేశ్వర్రెడ్డి, లింగారెడ్డి, ఇతర అధికారులు, ఆయా భవనాలు నిర్మిస్తున్న కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: Phone Tapping Case: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి?