Surveyor Shortage: అసలు ఉన్నడా.. లేడా..
-సర్వేయర్ కొరతతో పేరుకుపోతున్న దరఖాస్తులు
-సమస్య పరిష్కారంలో స్థానిక తహశీల్దార్ విఫలం
– సర్వేయర్ ను నియమించాలంటూ వేడుకుంటున్న ప్రజలు
స్వేచ్చ, రాజేంద్రనగర్: గండిపేట్ మండలంలో సర్వేయర్ ఎక్కడ ఉన్నడు అనే సందేహాలు స్తానిక ప్రజల నుండి పెద్ద ఎత్తునా వినిపిస్తున్నాయి. గండిపేట మండలంలో సర్వేయర్ ఎప్పుడు వస్తాడో తెలవదు.. వస్తే సర్వే పనులు చేస్తారా అనే ఆరోపనలు ప్జల నుండి వినిపిస్తున్నాయి. గండిపేట్(Gandipeta) మండలాన్ని సర్వేయర్ కొరత వేధిస్తుంది. సర్వేయర్ లేక ఎక్కడి పనులు అక్కడే నిలిచి పోతున్నాయి. సర్వేయర్ కారణంగా ఏవైనా పనులు చేయించుకునేందుకు వచ్చిన వారి పనులు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మండలం కోసం పనిచేయాల్సిన సర్వేయర్ లేక అవస్థలకు గురవుతున్నామంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములకు సంబంధించిన విషయాలలో సర్వేయర్ పాత్ర కీలకంగా ఉన్న నేపథ్యంలో సర్వేయర్ కొరత వేధింపును ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. రంగారెడ్డి(Rangareddy) జిల్లాలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్న క్రమంలో క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్వేయర్ అవసరం ఉన్నప్పటికీ అధికారులు మాత్రం గుమ్మనంగా ఉండడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా గండిపేట్ మండల పరిధిలో సర్వేయర్ లేకపోవడం ఏంటంటూ ప్రజలు మండిపడుతున్నారు.మండలంలో ప్రధానంగా కోన్ని సర్వే పనులు ఉన్నప్పటికీ వాటిని సర్వే చేయాలని ఎంఆర్ఓ(MRO) చెప్పిన పెడ చెవునా పెడుతున్నారని పెద్ద ఎత్తునా విమర్శలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి. ప్రధానంగా తహశీల్దార్ ఈ విషయంపై దృష్టి సారించకపోవడంతోనే ఇలా సమస్య ఎదురవుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మండల తహశీల్దార్ చొరవ చూపి సర్వేయర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియదు..!
స్థానిక సర్వేయర్ మూడు రోజులపాటు ఒకచోట, మరో మూడు రోజులు గండిపేట్ మండలానికి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఈ సర్వేయర్(Surveyor) ఎప్పుడు వస్తాడో.. ఎప్పుడు వెళ్తాడో తెలియదు అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కుప్పలు కుప్పలుగా సర్వే నిర్వహించాల్సిన దరఖాస్తులు పేరుకుపోయాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా తహశీల్దార్ తీరు మార్చుకొని శాశ్వత సర్వేయర్ ను ఏర్పాటు చేయాలని ప్రజలు విన్నవిస్తున్నారు.
కుప్పలుతెప్పలుగా సర్వే దరఖాస్తులు
గండిపేట్ మండల పరిధిలో కుప్పలు తెప్పలుగా భూవివాదాలు పేరుకుపోయాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం సర్వేయర్ కొరత ఉండడం వల్లనే అంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషయంపై అధికారుల నిర్లక్ష్యాన్ని భరించలేక కొందరు కోర్టును ఆశ్రయించి తమ భూములను సర్వే చేయించాలని, ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలంటూ పిటిషన్లు వేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్ర రూపం దాల్చిందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు మరో ఇద్దరు యజమానులు కోర్టు ధిక్కరణ కేసులను వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ విషయంపై ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఏకంగా కలెక్టర్ స్థాయి అధికారులను సైతం బదిలీలు చేసినట్లు సమాచారం. అయినా స్థానికంగా పూర్తిస్థాయి సర్వేయర్లు ఏర్పాటు చేయడంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందుతుందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సర్వేయర్ కొరతను గుర్తించాలని ప్రజలు వేడుకుంటున్నారు.
జిల్లాలో 27 మండలాలకు 14 మంది సర్వేయర్లే..!
నిత్యం భూముల ధరలు ఆకాశంలో ఉండే రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న 27 మండలాలకు సర్వేయర్లు 14 మంది మాత్రమే ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు సైతం తెలిసి తెలియనట్లుగా వ్యవహరించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలక మండలాలను వదిలేసి అంతగా పని లేని మండలాలకు సర్వేయర్లను నియమించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ సర్వేయర్ కోసం గట్టిగా ప్రయత్నస్తే లంచాలను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత సర్వేయర్ సైతం ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలు గుర్తు చేస్తున్నారు. అయినా ఈ సర్వేయర్లు మాత్రం తీరు మార్చుకోవడం లేదని ఆరోపణలు పెద్ద ఎత్తుగా వినిపిస్తున్నాయి. ఇన్చార్జి సర్వేయర్ ను తొలగించి పూర్తిస్థాయి సర్వేయర్ ను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: Akhanda 2: ‘అఖండ 2’కు అవతార్ రూపంలో గండం.. నిరాశలో నందమూరి ఫ్యాన్స్!
