Vanamahotsavam: వనమహోత్సవాన్ని ఫారెస్టు డిపార్టుమెంటు అధికారులు మహోద్యమంలా ముందుకు తీసుకెళ్లి నూరుశాతం విజయవంతం చేయాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ వనమహోత్సంలో భాగస్వామ్యం అయ్యేలా చూడాలన్నారు. వన మహోత్సవం-2025 పోస్టరును బుధవారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాటిన ప్రతీ మొక్కను బతికించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కలకు నీటి సదుపాయం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. పండ్ల మొక్కలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
Also Read: Bonalu Festival: సంస్కృతి సంప్రదాయాలకు.. అద్దం పట్టేలా బోనాలు!
నూరు శాతం టార్గెట్ రీచ్ కావాలి
జిల్లాల్లో జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని సూచించారు. ఈ సారి నూరు శాతం టార్గెట్ రీచ్ కావాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో వన నర్సరీల ద్వారా మొక్కలు పెంచి అదే గ్రామంలో నాటించడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. గతంలో ఎదురైన అనుభవాలు, తప్పిదాలు పునరావృత్తం కాకుండా అవసరమైన జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. ప్రతీ ఇంటికి మొక్కలు ఇచ్చి నాటేందుకు ప్రోత్సహించాలని చెప్పారు. గులాబీ, మందార, సీతాఫలం, జామ, ఉసిరి, అల్ల నేరేడు, మునగ, కానుగ, తులసి, ఈత మొక్కలతో పాటు పలు ఔషద మొక్కలు, పూల మొక్కలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఏ ఏరియాలో ఎటువంటి చెట్లు నాటాలో గుర్తించి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని మంత్రి సూచించారు. ఈత, తాటి, వేప, చింత, కుంకుడు మొక్కలు నాటించాలన్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటిన వారికి గుర్తించి ప్రోత్సాహాకాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అటవీ ప్రధాన సంరక్షిణాధికారి డాక్టర్ సువర్ణ, సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్, సోషల్ ఫారెస్టు రామలింగం తదితరులు పాల్గొన్నారు.
Also Read: Kangana Ranaut: హనీమూన్ మర్డర్ కేసుపై కంగనా సంచలన వ్యాఖ్యలు