KTR: తెలంగాణలో కాళేశ్వరం అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోమారు ఖండించారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు (Harish Rao)కు పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission) నోటీసులు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. దేశంలో ఏ మంత్రి పని చేయని విధంగా అద్భుతంగా తక్కువ కాలంలోనే ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత హరీష్ రావుదని కేటీఆర్ (KTR) అన్నారు.
రేవంత్ పాలనకు కొత్త ట్యాగ్లైన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కు జరిగిన అన్యాయం గురించి విద్యాసాగర్ రావు (Vidya Sagar Rao) ప్రతి క్షణం ప్రతి చోట చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)లో నీళ్ళు, నిధులు, నియామకాలు టాగ్ లైన్ ఎప్పుడో పోయిందని ఆరోపించారు. నిందలు, దందాలు, చందాలు ఇప్పటి పాలనలో నడుస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని చెప్పారు. సుంకిశాల, SLBC టన్నెల్ కూలినా.. కేంద్ర బృందం ఇప్పటివరకు రాలేదని మండిపడ్డారు. SLBC టన్నెల్ కూలి పేద కూలీలు చనిపోయిన ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బనక చర్లతో తెలంగాణకు అన్యాయం
మరోవైపు మేడిగడ్డలో చిన్న పిల్లర్ కూలితే దాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాద్దాంతం చేస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. కూలిన రెండు రోజుల్లోనే NDSA వచ్చిందని.. పనికిమాలిన రిపోర్ట్ ఇచ్చిందని ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ బీజేపీ కుమక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం కమిషన్ పేరిట రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. అందరికీ అర్దం అయ్యేలా కాళేశ్వరం వివరాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో చెప్పాలని హరీష్ రావును స్వయంగా కోరినట్లు చెప్పారు. బనక చర్లతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా సీఎం రేవంత్ సహా.. రాష్ట్ర మంతులు సైలెంట్ గా ఉంటున్నారని మండిపడ్డారు. ఏదేమైనా ఎన్నడైనా తెలంగాణ కు కేసిఆరే శ్రీ రామ రక్ష అని కేటీఆర్ అన్నారు.
Also Read: CM Revanth Reddy: చిన్నారికి కొండంత కష్టం.. రంగంలోకి సీఎం.. కీలక ఆదేశాలు జారీ
మాగంటిని పరామర్శించిన కేటీఆర్
అంతకుముందు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిని కేటీఆర్ సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ని కేటీఆర్ పరామర్శించారు. మాగంటి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. మాగంటి గోపీనాథ్కి అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి కేటీఆర్ తెలుసుకున్నారు. కేటీఆర్ వెంట దాసోజు శ్రవణ్, రవీందర్రావు, మాలోతు కవిత, రాగిడి లక్ష్మారెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు.