MLC Kavitha: గులాబీ పార్టీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గుబులు పట్టుకున్నది. ఆమె ఎవరిని టార్గెట్ చేస్తారో? ఎవరిపై ఎలాంటి విమర్శలు చేస్తారో? ఎవరి అక్రమాలు బయటపెడుతారో తెలియని పరిస్థితి. ఆమె చేస్తున్న ఆరోపణలు విమర్శలు అధికార కాంగ్రెస్(Congress)కు, ఇతర పార్టీలకు సైతం అస్త్రంగా మారుతున్నాయి. పార్టీపై, నేతలపై వరుసగా కవిత చేస్తున్న విమర్శలు ఇరుకున పెడుతున్నాయి. గత కొన్నిరోజులుగా దూకుడు పెంచిన కవిత, బీఆర్ఎస్, ఆ పార్టీ నేతలపై విమర్శలకు పదును పెట్టారు. పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత ఆమె, ఆ పార్టీలోని కీలక నేతలు లక్ష్యంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరోపణ చేస్తున్నారు. వారి పనితీరును తప్పుపడుతున్నారు. ‘జాగృతి జనం’ బాటలో భాగంగా ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆమె ఏ నియోజకవర్గానికి వెళ్లినా, ఏ జిల్లాకు వెళ్లినా అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకోవడం, గత ప్రభుత్వ పాలన వైఫల్యాలు, నేతల అవినీతిని ఎండగడుతున్నారు. పార్టీలో కీలకమైన కేటీఆర్(KTR), హరీశ్ రావు(Harish Rao), జగదీష్ రెడ్డి(Jagadesh Reddy), నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) తదితరులపై గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీకి జరుగుతున్న నష్టాన్ని సైతం వివరిస్తూ వస్తున్నారు.
గ్రేటర్ నుంచి మొదలు..
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోడ్ ఉండటంతో మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్(Hyderabad) జిల్లాల్లో ప్రస్తుతం యాత్ర కొనసాగిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు అవినీతి చేశారని, భూ కబ్జాలకు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా కుత్బుల్లాపూర్లో పరికచెరువు 64 ఎకరాలు ఉండగా ప్రస్తుతం 16 ఎకరాలకు పరిమితమైందని, ఈ చెరువు కబ్జాకు ఎమ్మెల్యేనే సహకరించాలని ఆరోపించారు. తాజాగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Madhavaram Krishna Rao) సైతం భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై స్పందించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kuymare Goud) సైతం విచారణ చేయిస్తామని పేర్కొన్నారు. యాత్రలో ఆమె ఆరోపణలు చేయడం, ఇటు బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ ప్రత్యారోపణలు చేయడంతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.
Also Read: Messi Hyderabad Visit: కోల్కత్తా ఎఫెక్ట్.. హైదరాబాద్లో హై అలర్ట్.. మెస్సీ కోసం భారీ భద్రత
ఏ నిమిషానికి..
కవిత జనం బాటలో ఎప్పుడు ఎవరిపై ఆరోపణలు చేస్తారోనని బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైంది. గులాబీ పాలనలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారి చిట్టాను బయటపెడుతుండటంతో, ఇవన్నీ ప్రభుత్వానికి అస్త్రాలుగా మారాయి. కవిత విమర్శలతో రాజకీయంగా డ్యామేజ్ అవుతుందని పలువురు నేతలు ఆందోళన చెందుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి, అధికారంలోకి వస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో కవిత ఆరోపణలు పెద్ద తలనొప్పిగానే మారాయి. ఆమె చేస్తున్న ఆరోపణలన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయని ఇది రాజకీయంగా ఇబ్బంది కలిగే అంశమని, ఆమెను కట్టడి చేస్తేనే మంచిదని, లేకుంటే భారీగా నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
Also Read: Messi In Hyderabad: మెస్సీతో ముగిసిన ఫ్రెండ్లీ మ్యాచ్.. గోల్ కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి

