Kaleshwaram Project Scam: కాళేశ్వరం అక్రమాల కహానీ (Kaleshwaram Project Scam)లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. పెను సంచలనం సృష్టించిన ఈ కేసులోకి త్వరలోనే ఏసీబీ ఎంట్రీ ఇవ్వనుంది. విచారణ జరపాలంటూ విజిలెన్స్ నుంచి లేఖ అందటంతో అనుమతి ఇవ్వాలని ఏసీబీ డీజీ ప్రభుత్వ కార్యదర్శిని లిఖితపూర్వకంగా కోరారు. అది రాగానే విచారణను ప్రారంభించనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరిపిన విజిలెన్స్ దీంట్లో ప్రాజెక్టులో పని చేసిన 50మందికి పైగా ఇంజనీర్లు దండిగా వెనకేసుకున్నారని నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. దీని ఆధారంగానే ఏసీబీ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన ఇద్దరు ఈఎన్సీలను అరెస్ట్ చేసి వందల కోట్ల రూపాయల అక్రమాస్తుల గుట్టును రట్టు చేసిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక స్థానాల్లో పని చేస్తున్న ఇంజనీర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి.
Also Read: RRB: రైల్వేలో ఉద్యోగాల జాతర.. 8,875 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై విజిలెన్స్ అధికారులు విచారణ
బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా చెప్పుకొని లక్ష కోట్ల రూపాయల వ్యయంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్((Kaleshwaram Project) లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కొన్ని నెలలకే కుంగిపోయిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఈ కుంగుబాటు బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావటానికి ఓ కారణంగా నిలిచింది. ఇక, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై మొట్టమొదటగా విజిలెన్స్ అధికారులు విచారణ చేశారు. అనంతరం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటానికి 57మంది అధికారులను బాధ్యులుగా పేర్కొన్నారు. బ్యారేజీ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17మంది నీటిపారుదల శాఖ అధికారులపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేశారు. ఎల్ అండ్ టీ సంస్థపై కూడా క్రిమినల్ చర్యలు చేపట్టాలని సూచించారు. దాంతోపాటు 33మంది ఇంజనీర్లకు జరిమానాలు విధించాలని పేర్కొన్నారు. రిటైరైన 7మంది ఇంజనీర్లపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులో కీలక స్థానాల్లో పని చేసిన అధికారులు వందల కోట్ల రూపాయలను వెనకేసుకున్నట్టుగా తెలియచేశారు.
ఇద్దరు ఈఎన్సీలు…వందల కోట్లలో ఆస్తులు…
ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ లు హరీరాం, మురళీధర్ రావులను ఏసీబీ అధికారులు అక్రమాస్తుల కేసుల్లో అరెస్టులు చేశారు. విచారణలో ఈ ఇద్దరు వందల కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్నట్టుగా నిర్ధారణ కావటం గమనార్హం.
వీరిపై చర్యలకు సిఫార్సు…
కాగా, చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన జాబితాలో ఇంజనీర్ ఇన్ ఛీఫ్ (ఆపరేషన్స్, మెయిన్ టెనెన్స్) భూపతిరాజు నాగేంద్ర రావు, గతంలో ఛీఫ్ ఇంజనీర్ గా పని చేసిన టీ.శ్రీనివాస్, వర్క్స్, అకౌంట్స్ డైరెక్టర్ ఫణిభూషణ్ శర్మ, డిప్యూటీ ఛీఫ్ ఇంజనీర్ మహ్మద్ అజ్మల్ ఖాన్, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ వెంకటేశ్వర్లు, ఛీఫ్ ఇంజనీర్ కొట్టే సుధాకర్ రెడ్డి, గతంలో డివిజన్ 1 ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ గా పని చేసిన వెంకట రమణారెడ్డి, డివిజన్ 3 ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ సర్దార్ ఓంకార్ సింగ్, డివిజన్ 1 డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ తిరుపతిరావు, క్వాలిటీ కంట్రోల్ ఛీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరి, రిటైర్డ్ ఛీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, క్వాలిటీ కంట్రోల్ ఛీఫ్ ఇంజనీర్ పీ.ఏ.వెంకటకృష్ణ, డివిజన్ 9 ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ఎం.రఘురాం, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్స్ ఈఎన్సీ నరేందర్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ చందక్రశేఖర్, ఎస్ఈ బసవరాజ్ ఉన్నారు. వీరితోపాటు మరికొందరిపై జరిమానాలు కూడా విధించాలని సిఫార్సు చేశారు.
విచారణ చేయాలంటూ ఏసీబీకి లేఖ…
తమ విచారణలో అక్రమాలకు పాల్పడినట్టుగా తేలిన ఈ అధికారులందరిపై సమగ్ర విచారణ జరపాలని తాజాగా విజిలెన్స్ అధికారులు ఏసీబీకి లేఖ రాశారు. ఈ క్రమంలో ఏసీబీ డీజీ దర్యాప్తునకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును లిఖితపూర్వకంగా కోరారు. అనుమతి లభించగానే అక్రమాలకు పాల్పడినట్టుగా విజిలెన్స్ అధికారుల విచారణలో తేలిన అధికారులందరికీ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. దాంతోపాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టులో వీళ్లంతా కలిసి ఎన్ని కోట్లు కొల్లగొట్టారన్న దానిని కూడా నిగ్గు తేల్చాలని నిర్ణయించినట్టు సమాచారం. సరిగ్గా ఈ పరిణామమే ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన అధికారులను వణికిస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాల కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో ఎప్పుడు విచారణకు పిలుస్తారోనని బిక్కుబిక్కుమంటున్న వీళ్లు పులి మీద పుట్రలా వచ్చిన తాజా పరిణామాలతో ఏం చేయాలో అర్థంగాక తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం.