*రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి సాధించిందేమీ లేదు
*రెండు పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి
*బీసీలు మోసపోవడానికి సిద్ధంగా లేరు
K Laxman: పంపకాల తగదాలతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ (Rajya Sabha Member K Laxman) విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee Hills by-election) ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల శక్తి కేంద్ర ఇన్ చార్జీలతో నిర్వహించిన సమావేశానికి సైతం హాజరయ్యారు.
కాంగ్రెస్ ముసుగులో ఎంఐఎం
ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఓట్ చోరీ, బీసీ నినాదాలను ఎత్తుకుని రాహుల్ గాంధీ అభాసు పాలయ్యారని వ్యాఖ్యానించారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతిపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని, వారిని కాదని రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి కూడా సాధించిందేమీ లేదన్నారు. ఈ రెండు పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని లక్ష్మణ్ విరుచుకుపడ్డారు. బీహార్ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలో ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కడతారని ధీమా వ్యక్తంచేశారు. ఓట్ చోరీ పేరిట కాంగ్రెస్ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని, బెంగాల్లో మమతా బెనర్జీ, హైదరాబాద్లో ఓవైసీ దొంగ ఓట్లకు కారణమవుతున్నాయని లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణలో బీసీలు మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) హయాంలో ముఖ్యమంత్రి ఎవరైనా రాష్ట్రంలో ఓవైసీకి మోకరిల్లాల్సిందేనన్నారు. దారుసలాంలో ఆశీర్వాదం తీసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ముసుగులో ఎంఐఎం (MIM) వస్తోందని, జూబ్లీహిల్స్ ప్రజలు దీన్ని గమనించాలని కోరారు.
Also Read- Hyderabad: డీసీపీపై కత్తితో దాడి.. డీజీపీ, సీపీ సీరియస్.. రంగంలోకి 5 ప్రత్యేక బృందాలు
దమ్మున్న పార్టీ బీజేపీ మాత్రమే
రాష్ట్రంలో గన్, డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయిందని, విక్టోరియా ప్లే గ్రౌండ్ లో డీసీపీ పైనే కాల్పులు జరగడం దేనికి సంకేతమో ప్రజలు ఆలోచన చేయాలని లక్ష్మణ్ కోరారు. నగరాన్ని మజ్లిస్ నుంచి రక్షించాలoటే బీజేపీ గెలవాలని తెలిపారు. ఇది ఎంఐఎం ముసుగు కప్పుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్కు మధ్య జరుగుతున్న ఎన్నిక కాదని, హైదరాబాద్ (Hyderabad) అభివృద్ధికి జరుగుతున్న ఎన్నికగా అభివర్ణించారు. దేశమంతా పోటీ చేసే ఎంఐఎం.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్ను ఎంఐఎం తన కబంధ హస్తాల్లోకి తీసుకోవాలని కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఎంఐఎంను ఎదిరించే దమ్మున్న పార్టీ బీజేపీ మాత్రమేనని లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
