Jubliee Hills Bypoll Live Updates:
సునీత గెలుపు కోసం కష్టపడ్డవారికి కృతజ్ఞతలు: కేటీఆర్
గత నెలరోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు పేరుపేరున కృతజ్ఞతలు అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, భయబ్రాంతులకు గురిచేసినా బయటకు వచ్చి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ఆయన ఆరోపించారు.
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక పోలింగ్ చెదుముదురు ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ మెుదలు కాగా.. ఓటు వేసేందుకు ప్రజలు క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటల వరకూ ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించారు. 4.01 లక్షల మంది ఓటర్ల కోసం 407 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాలకు వచ్చి జూబ్లీహిల్స్ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ ఎలా సాగిందంటే?
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ సమయం ముగిసింది. సా. 6 గంటల సమయం దాటిపోవడంతో కొత్తవారిని పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించడం లేదు. క్యూలైన్లలో ఉన్న వారికి మాత్రం ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పోలింగ్ ప్రశాంతంగా సాగింది. మధ్యాహ్నం తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రెస్ మీట్ నిర్వహించడంతో కాస్త గందరగోళం ఏర్పడింది. పోలింగ్ ముగింపునకు వచ్చేసరికి మాగంటి సునీత రోడ్డుపై బైఠాయించడం, పలు చోట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగడంతో కాస్త ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది. సాయంత్రం 5 గంటల వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 47.16 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు
సునీత బైఠాయింపు
బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత నిరసనకు దిగారు. కష్ణానగర్ అమరావతి స్కూల్లోని 238 పోలింగ్ కేంద్రం వద్ద రిగ్గింగ్ జరుగుతోందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు మాగంటి సునీతకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు సైతం నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
కాంగ్రెస్ నేతలు రిగ్గింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి మాగంటి సునీత నిరసన pic.twitter.com/YT1eahOYka
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2025
బీఆర్ఎస్ ఏజెంట్ల నిరసన
మరోవైపు కృష్ణానగర్ డాన్ బాస్కో స్కూల్ పోలింగ్ వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన అనుచరులతో పోలింగ్ బూత్ లను పరిశీలించడానికి వెళ్లిన సమయంలో తమను బయటకు పంపారని బీఆర్ఎస్ ఏజెంట్లు ఆరోపణలు చేశారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
డాన్ బాస్కో స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ ఏజెంట్ల నిరసన..
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పోలింగ్ బూత్ లను పరిశీలించడానికి లోపలికి వెళ్లిన టైంలో ఏజెంట్లను బయటకు పంపారంటూ బీఆర్ఎస్ ఇంఛార్జీల ఆరోపణ#JubileeHillsByElection pic.twitter.com/ZsyMDFOtOm
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2025
5 గంటల వరకూ పోలింగ్..
జూబ్లీహిల్స్ ఎన్నికల పోలింగ్ నెమ్మదిగా సాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సా.5 గం.ల మధ్య 47.16 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. 6 గంటల వరకూ ఓటు వేసే అవకాశం ఉన్నందున పోలింగ్ శాతం 50 శాతం దాటొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
మాగంటి సునీతపై ఫిర్యాదు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత (Maganti Sunita)పై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల నియమావళిని ఆమె ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈసీ నింబంధనలకు విరుద్దంగా ఆమె ప్రెస్ మీట్ నిర్వహించడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా జూబ్లీహిల్స్ ఓటర్లను ఆమె ప్రభావితం చేశారని ఫిర్యాదులో పేర్కొంది.
మాగంటి సునీతపై ఎలక్షన్ కమిషన్ కు కాంగ్రెస్ ఫిర్యాదు..
ఎన్నికలు జరుగుతుండగా ప్రెస్ మీట్ నిర్వహించడం ఈసీ నిబంధనలకు విరుద్ధమన్న కాంగ్రెస్ నేతలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సునీత ఉల్లంఘించారని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు#JubileeHillsByElection pic.twitter.com/mBYQ8Lej6P
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2025
సునీత ఏమన్నారంటే?
అంతకుముందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో సునీత మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపించారు. ఓటర్లను భయపెడుతున్నారని అన్నారు. పలు చోట్ల రౌడీ షీటర్లు తిరుగుతున్నారన్న సునీత.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యకు జూబ్లీహిల్స్ లో ఉన్న పని ఏంటని ఆమె నిలదీశారు.
3 గం.ల వరకూ పోలింగ్ ఎంతంటే?
మరోవైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు నెమ్మదిగా సాగుతున్నాయి. మధ్యాహ్నం 3 గం.ల సమయానికి 40.20 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమీషన్ అధికారికంగా ప్రకటించింది. ఉదయం 7 గం.ల నుంచి పోలింగ్ జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకూ సగం మంది ఓటర్లు కూడా పోలింగ్ లో పాల్గొనకపోవడం చర్చకు తావిస్తోంది. మరోవైపు ఓటు వేసేందుకు 6 గం.ల వరకూ సమయం ఉన్నందున పోలింగ్ శాతం ఎంతకు చేరుతుందన్న ఉత్కంఠ మెుదలైంది.
జూబ్లీహిల్స్ లో కొనసాగుతున్న పోలింగ్..
మధ్యాహ్నం 3 గంటలకు 40.20 శాతం ఓటింగ్ నమోదు
పోలింగ్ కు ఇంకా మిగిలి ఉన్న 3 గంటల సమయం
పోలింగ్ సమయం పూర్తి అయ్యే సరికి ఎంత శాతం నమోదు అవుతుందోనని ఉత్కంఠ#JubileeHillsByElection pic.twitter.com/H6KUh02LHQ
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2025
సీఈసీ సీరియస్..
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో నాన్ లోకల్స్ పెద్ద మెుత్తంలో సంచరిస్తుండటంపై పలు పార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి సైతం సీరియస్ అయ్యారు. నియోజకవర్గంలోని స్థానికేతరులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకూ నాన్ లోకల్స్ పై 3 ఎఫ్ఐఆర్ లు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. అయితే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతున్న వెల్లడించారు.
ఉ.11 గం. జరిగిన పోలింగ్ ఎంతంటే?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే 11 గంటల వరకూ 20.76 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. అయితే 4 గంటలు దాటినా కనీసం 25 శాతం కూడా పోలింగ్ దాటకపోవడం గమనార్హం. దీన్ని బట్టి పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఓటు వేసిన ప్రధాన అభ్యర్థులు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన.. పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్లు చెప్పారు. తొలి 45 నిమిషాల్లోనే 70-100 ఓట్లు పోలైనట్లు తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత.. ఎల్లారెడ్డి గూడ నవోదయనగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ.. పోలింగ్ ఏర్పాట్లు సరిగా లేవని అంసతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లు చాలాసేపు క్యూలైన్ లో ఉండాల్సి వస్తోందని అన్నారు. అటు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీనగర్ కాలనీలోని పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేశారు.
9 గం.ల వరకూ 10.2% పోలింగ్..
జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో ఉదయం 9 గంటల వరకూ 10.2 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ సరళి చాలా నెమ్మదిగా ఉన్నట్లు పేర్కొన్నారు. వెంగళరావు నగర్, షేక్ పేటలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంలు మెురాయిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల ఆయా కేంద్రాల వద్ద ఓటు వేయడానికి వచ్చిన ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
Also Read: Delhi Red Fort Blast: ఢిల్లీ పేలుడు మిస్టరీని ఛేదిస్తున్న పోలీసులు.. పుల్వామా వ్యక్తికి నకిలీ పత్రాలతో కార్ విక్రయం
120వ బూత్ వద్ద ఉద్రిక్తత
వెంగళరావు నగర్ లోని 120వ నెంబర్ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓటర్లకు బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాలను శాంతింపజేశారు. డబ్బులు పంచే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ vs బీఆర్ఎస్
వెంగళరావునగర్ పోలింగ్ బూత్ నెంబర్ 120 వద్ద ఉద్రిక్తత
ఓటర్లకు బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని గొడవకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు
దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కాసేపు తోపులాట pic.twitter.com/uHzqAJnTH0
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2025

