Journalists Protest: 252 జీవోను సవరించాలని డిమాండ్
సంగారెడ్డిలో కలెక్టరేట్ ముందు ధర్నా
అదనపు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన జర్నలిస్టులు
సంగారెడ్డి, స్వేచ్ఛ: జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252ను వెంటనే సవరించాలంటూ సంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే హెచ్143 (TUWJ H143) జర్నలిస్టులు (Journalists Protest) డిమాండ్ చేశారు. అక్రెడిటేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని మానుకోవాలని సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. అనంతరం అడిషినల్ కలెక్టర్ చంద్రశేఖర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో 23 వేల అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వగా, కొత్త జీవో రాకతో 10 వేలకు పైగా కార్డులకు కోత పడే ప్రమాదం ఉందని జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లకు ఒక కార్డు ఉండేదని, ఇప్పుడు అది రద్దు చేసి స్టేట్, జిల్లా, మండలస్థాయిలో మాత్రమే కార్డులు ఇవ్వాలని నిర్ణయించడం దారుణమని పేర్కొన్నారు. గతంలో జనరల్, స్పోర్ట్స్, కల్చరల్, ఫిల్మ్, కార్టూనిస్టులకు ప్రత్యేక కోటా ఉండేదని, ఇప్పుడు ఈ కోటాను రద్దు చేశారని విచారం వ్యక్తం చేశారు. ఫ్రీలాన్స్ కోటాలో కార్టూనిస్టులకు మాత్రమే అక్రెడిటేషన్లు పరిమితం చేశారని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్కు డిగ్రీ విద్యార్హత, లేదా ఐదేండ్ల అనుభవం ఉండాలని, జిల్లా, మండలస్థాయి రిపోర్టర్లకు ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరి చేశారని, కానీ వీరి అనుభవాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఆటో డ్రైవర్లకు, సర్పంచ్లకు, పార్టీ కార్యకర్తలకు ఇచ్చే విధానాలకు ప్రభుత్వం స్వస్తి పలకాలని ఈ సందర్భంగా కోరారు. ఇదివరకు పట్టణ ప్రాంతాలు, మండలాల్లో 50 వేల జనాభాకు ఒక అక్రెడిటేషన్ కార్డు చొప్పున ఇచ్చేవారని, కానీ ఇప్పుడు మండలానికి ఒక కార్డు మాత్రమే ఇస్తామని ఆ జీవోలో పేర్కొనటం సరికాదని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు.
కేబుల్ చానళ్లకు జిల్లా స్థాయిలో ఇచ్చే కార్డులను రద్దు చేశారని జర్నలిస్టులు ప్రస్తావించారు. ఇది వరకు జిల్లా స్థాయిలో కార్డులు ఇచ్చేవారని గుర్తుచేశారు. అక్రెడిటేషన్ కార్డులతో ఎలాంటి ప్రత్యేక హోదా ఉండదని, కేవలం జర్నలిజం కోసం మాత్రమే వాడాలని, విజిటింగ్ కార్డులు, లెటర్ హెడ్స్పై ‘అక్రెడిటేటెడ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’ అన్న పదాలు వాడరాదని, ముద్రించరాదని పేర్కొనటం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ జీవో చిన్న పత్రికలను చిదిమేస్తుందని, మూలిగే నక్క మీద తాటి కాయ అన్న చందంగా చిన్న పత్రికలకు ఇబ్బందికరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కఠినమైన నిబంధనలతో అక్రెడిటేషన్ రూల్స్ రూపొందించారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి, ఈ జీవోను సవరిచాంచాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే హెచ్143 సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి గౌడ్, రాష్ట్ర నాయకులు దారాసింగ్ సీహెచ్ పరశురాం, వేణుగోపాల్ రెడ్డి, నాగరాజు, కరుణాకర్ రెడ్డి, క్రాంతి, నగేష్ గౌడ్, శ్రీకాంత్, అమృతం, ప్రదీప్, రాఘవరెడ్డి, నారాయణ, పవన్తో పాటు జిల్లాలోని వివిధ మండలాల నుంచి జర్నలిస్టులు తరలివచ్చారు.
Read Also- Ponguleti Srinivasa Reddy: అవినీతి లేని పాలనే లక్ష్యం.. అభివృద్ధిలో దూసుకుపోతాం.. మంత్రి పొంగులేటి

