MP Aravind: జూబ్లీహిల్స్ ఉపపోరులో ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. దీంతో, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ ప్రచారాన్ని మరింత హోరెక్కించాయి. పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో, హస్తం పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మధ్య ప్రచార పోరు ‘నువ్వా-నేనా’ అన్నట్టుగా సాగుతోంది. అయితే, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ప్రచారం విషయంలో కాస్త నెమ్మదిగా కనిపిస్తున్నారంటూ మొదటి నుంచి టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించి ఒక ఆసక్తికర అంతర్గత వ్యవహారం బయటకు వచ్చింది.
రాంచందర్ రావు, ఎంపీ అరవింద్ మధ్య విభేదాలు?
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం వేళ బీజేపీలో విభేదాలు చోటుచేసుకున్నాయా? అనే సందేహం కలిగే పరిణామం ఒకటి శుక్రవారం చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడురాం చందర్ రావును ఉద్దేశించి నిజామాబాద్ ఎంపీ అరవింద్ (MP Aravind) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్లో తాను ప్రచారం నిర్వహించడం లేదంటూ వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, జూబ్లీహిల్స్ చేసే ప్రచారం కంటే, సోషల్ మీడియా వేదికగా తానే ఎక్కువ ప్రచారం చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రచారానికి రాలేదని అధిష్టానానికి ఫిర్యాదు చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘ నా సోషల్ మీడియా బలంతో చేస్తున్న ప్రచారం, మీరు జూబ్లీహిల్స్లో ఫిజికల్గా చేస్తున్న ప్రచారం కంటే ఎక్కువ. వారు చేస్తున్నదానికంటే ఎక్కువగానే ఉంది. రాం చందర్ రావు గారూ, నేను ప్రచారం చేయడం లేదంటూ అధిష్టానికి ఫిర్యాదు చేయకండి’’ అని అరవింద్ పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం అక్కడ చేసే వాళ్ల కంటే తాను ఎక్కువ చేస్తున్నానని ఎంపీ అరవింద్ పునరుద్ఘాటించారు. ‘‘మీరు మాట్లాడిన మాటలకు, నా ఒక్క సోషల్ మీడియా ప్రచారం ఎక్కువ. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం నేనూ చేస్తున్నాను. ఇంధూరుకి వచ్చినా ఇక్కడి నుంచి ప్రచారం చేస్తున్నా. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు.. నా మీద కంప్లైంట్స్ చేయకండి’’ అని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ బీజేపీ పెద్ద స్థాయిలో ఉందని, తాను ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకుంటానన్నారు. దానికి సాక్ష్యం ఆర్మూర్ ఎంఎల్ఏ రాకేష్ రెడ్డి అంటూ అరవింద్ పేర్కొన్నారు. తాము గ్రామస్తులమని, పల్లెల్లో తిరుగుతూ ఉంటామని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో నాయకులున్నారని, సీనియర్ నేతలు, ఎంపీలు, మంత్రులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ప్రచారాన్ని వారు చూసుకుంటారని అరవింద్ చెప్పారు.
Read Also- Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. వి. కావేరి ట్రావెల్స్ యజమాని అరెస్ట్
కాగా, జూబ్లీహిల్స్ ప్రచారం విషయంలో ఆరంభంలో వెనుకబడినట్టు కనిపించిన బీజేపీ గత నాలుగైదు రోజుల్లో బాగా పుంజుకుంది. తమ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర అధ్యక్షుడు వంటి కీలక నాయకులు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విమర్శలు గుప్పిస్తున్నారు.
