Jubilee Hills Bypoll: ఆ సెగ్మెంట్పై ఓ మాజీ మంత్రి దృష్టి
ప్రస్తుతం సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా.. రాజీనామా చేస్తానంటూ రిక్వెస్ట్
రెండు చోట్లా బై ఎలక్షన్లకు ప్రతిపాదన
టెక్నికల్ సమస్యతో సతమతం
రెండు సెగ్మెంట్లలోనూ గెలుపు బాధ్యతలు తీసుకుంటానని హామీ
కొత్త ప్రపోజల్తో టీ పీసీసీ షాక్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గ్రేటర్ హైదరాబాద్కు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంపై టెక్నికల్ సమస్యలు ఉన్నందున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గెలిచిన తర్వాత ప్రస్తుత నియోజకవర్గానికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. లేదా, ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి రిజైన్ చేస్తానని, గ్రేటర్ హైదరాబాద్లోని ఈ రెండు నియోజకవర్గాలకూ ఒకేసారి బై పోల్ తీసుకురావాలని ఆయన పార్టీని కోరినట్లు తెలిసింది.
ఈ రెండు కీలక నియోజకవర్గాల గెలుపు బాధ్యతలను తానే తీసుకుంటానని ఆయన పార్టీ దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. తనకు మంత్రిగా పనిచేసిన అనుభవం, గ్రేటర్ హైదరాబాద్లో పట్టు, కార్యకర్తల సపోర్టుతో తప్పనిసరిగా రెండు నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలను తీసుకుంటానని చెప్తున్నారట. ఇదే విషయాన్ని తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో తన సన్నిహిత ఎమ్మెల్యేలతో ఆ మాజీ మంత్రి సరదానే వ్యాఖ్యానించినప్పటికీ, ఆయన మనసులోని మాట పార్టీ దృష్టికి కూడా చేరవేసినట్లు తెలిసింది. కొత్త ప్రపోజల్తో టీపీసీసీ అవాక్కైంది. అయితే గ్రేటర్లో పట్టున్న నేతగా ఆయనకు గుర్తింపు ఉండటంతో..ఆ ప్రపోజల్పై కూడా ఇతర సీనియర్ల నుంచి పార్టీ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ విషయం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఆశావహులతో పాటు పొలిటికల్ సర్కిళ్లలోనూ హట్ టాపిక్గా మారింది.
Read Also- Blood Moon 2025: ఈ ఆదివారం ఆకాశంలో అద్భుతం.. ప్రత్యేక పరికరాల అవసరం లేకుండానే వీక్షించవచ్చు
బీఆర్ ఎస్ బీ ఫామ్పై…
తమ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని, ఇది ఫిరాయింపుల చట్టం కింద వర్తిస్తుందని బీఆర్ఎస్ హైకోర్టులో కేసు ఫైల్ చేసింది. ఆ తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం కేసు నడుస్తోంది. అయితే, పది మందిలో గ్రేటర్ హైదరాబాద్కు చెందిన ఓ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ఓ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ బీ ఫామ్పై పోటీ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేయకుండానే ఇతర పార్టీ బీ ఫామ్పై పోటీ చేయడం ఫిరాయింపుల చట్టం కింద వస్తుందనేది పొలిటికల్ అనాలసిస్టులు చెబుతున్నారు. లీగల్, టెక్నికల్ సమస్యలు తప్పనిసరిగా వస్తాయని వివరిస్తున్నారు. దీంతో మిగతా 9 మందితో పోల్చితే సిటీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే చట్టపరంగా సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి ఆయన సతమతమవుతున్న ట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త ప్రజోజల్ను పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే పార్టీ తుది నిర్ణయం ప్రకారమే తమ బాస్ నడుచుకుంటారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
Read Also- Ganesh immersion: గణేష్ నిమజ్జనం దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే
సీరియస్ స్టడీ..??
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో గెలిచేందుకు కాంగ్రెస్ తీవ్రంగా కష్టపడాల్సి వస్తోన్నది. అధికారంలో ఉన్నప్పటికీ, ముగ్గురు మంత్రులు ఇన్చార్జ్లుగా క్షేత్రస్థాయిలో వర్క్ చేస్తుండగా, సుమారు డజను మంది కార్పొరేషన్ చైర్మన్లు ఆ నియోజకవర్గంలో క్రమం తప్పకుండా పర్యటిస్తున్నారు. డివిజన్లు వారీగా వర్క్ డివైడ్ చేసుకొని సమన్వయంగా పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు వర్క్ చేస్తుండగా, సీఎం కూడా చిత్రపరిశ్రమ, ఇతర కీలక వ్యక్తులను ఎప్పటికప్పుడు సంప్రదించి, కాంగ్రెస్ అండగా ఉండాలని సూచినట్లు తెలిసింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు విజయం దక్కించేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలీలో స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. అయితే పార్టీ, ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యూహాల ఫలితం ఏ విధంగా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది.