Bhatti Vs Harish Rao: నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల వ్యవహారంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అయిన బొగ్గు సంపదపై రాబందులు, గద్దలను వాలనివ్వబోనంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇవాళ (జనవరి 24) ప్రెస్మీట్లో అన్నారు. ఈ విషయంలో విషపు రాతలు రాస్తున్నారంటూ ఓ మీడియా సంస్థ అధినేతపై మరోసారి విమర్శలు చేశారు. అయితే, భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు (Bhatti Vs Harish Rao) స్పందించారు. ‘‘ భట్టి గారూ.. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా మసిబూసి మారేడు కాయ చేశారు. మీరెన్ని సాకులు చెప్పినా మీ కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగింది నిజం. అందదులో రేవంత్ రెడ్డి బామ్మర్ది రింగ్ మెన్గా పాత్ర పోషించింది నిజం’’ అని హరీష్ రావు ఆరోపించారు.
Read Also- Laddu Adulterated Ghee: ఛార్జిషీట్ను ఆయుధంగా మలుచుకున్న వైసీపీ.. చంద్రబాబు, పవన్ ఇరుకునపడినట్టేనా?
నేను సూటిగా అడుగుతున్నా..
ఏ స్కాం జరగకుంటే నైనీ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఎందుకు ప్రకటించారు? అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను హరీష్ రావు ప్రశ్నించారు. ‘‘నిన్న నేను బయటపెట్టిన మరో కుంభకోణం.. సోలార్ పవర్ స్కాం గురించి ఎందుకు ఒక్క మాట కూడా నేటి ప్రెస్ మీట్లో మాట్లాడలేదు?. నైనీని రద్దు చేసినట్లే మిగతా అన్ని టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదు?. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనను బీఆర్ఎస్ మీద నెట్టే ప్రయత్నం చేయడం వల్ల నిజాలు అబద్దాలు అయిపోవు. జరిగిన స్కాంలు, స్కీంలుగా మారిపోవు. సైట్ విజిట్ నిబంధనను 2018లోనే మొదలైందని చెప్పి, దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉదాహరణలుగా చెప్పి ఏం చెప్పదలుచుకున్నారు?. అది తప్పు కాకుంటే నైనీ ఎందుకు రద్దు చేసినట్లు?’’ అని హరీష్ రావు పేర్కొన్నారు.
అందుకు ధన్యవాదాలు
ఇదే సైట్ విజిట్ విధానం సింగరేణిలో కూడా అమలు చేశామని ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అని హరీష్ రావు పేర్కొన్నారు. సైట్ విజిట్ అమలయ్యింది, నైనీ రద్దు జరిగింది అంటే.. స్కాం జరిగినట్లే కదా? అని ప్రశ్నించారు. ‘‘భట్టి విక్రమార్క గారూ.. మీరంటే నాకు చాలా గౌరవం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై విచారణ జరగాలంటే సిట్టింగ్ జడ్జీ, లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐ మాత్రమే చేయగలవు అన్న ఉద్దేశ్యంతోనే లేఖ రాశాను. మీరు నిజంగా రేవంత్ రెడ్డి, అతడి బావమరిది కుంభకోణం మీద నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తానని హామీ ఇస్తే మీకూ లేఖ రాయడానికి సిద్దం’’ అని మాజీ మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.

