Harish Rao: కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయమని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) మండిపడ్డారు. ఉపాధ్యాయుల దినోత్సవం రోజూ ఆడంబరంగా ప్రకటనలు చేయడం కాదు ముందు వారికి సకాలంలో జీతాలు చెల్లించు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. విష జ్వరాలు, పాముకాట్లు, ఎలుక కాట్లు, కుక్కకాట్లు, ఫుడ్ పాయిజనింగ్ తో విద్యార్థులు ఆస్పత్రుల పాలై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దాపురించిందన్నారు.
కల్తీ ఆహారం పెడితే జైలుకే
గురుకులాల్లో పనిచేస్తున్న 2500 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వని దుస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నేనే ఇకనుండి గురుకులాలను పర్యవేక్షిస్తానని చెప్పిన మాటలు నీటి మూటలు అయ్యాయని ఆరోపించారు. కల్తీ ఆహారం పెడితే జైలుకే అని ఇచ్చిన ప్రకటనలు గాలి మాటలయ్యాయన్నారు. కేసీఆర్(KCR) పాలనలో గురుకుల విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిస్తే రేవంత్ రెడ్డి పాలనలో నరక కూపాలుగా మారాయన్నారు. నాడు 294గా ఉన్న గురుకులాల సంఖ్యను 1024 కి పెంచిన ఘనత కేసీఆర్ ది అని పేర్కొన్నారు. గురుకులాల్లో లక్ష 90 వేలుగా ఉన్న విద్యార్థుల సంఖ్యను ఆరున్నర లక్షలకు పెంచి నాణ్యమైన విద్యను కేసీఆర అందించారన్నారు.
Also Read: MLC Kavitha: త్వరలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: ఎమ్మెల్సీ కవిత
గురుకులాలకు అత్యంత ప్రాధాన్యత
విద్యపై చేసే వ్యయాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్(Capital Investment) గా భావించిన కేసీఆర్(KCR) .. గురుకులాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కానీ కాంగ్రెస్ 22 నెలల పాలనలో గురుకులాల ఖ్యాతి అధఃపాతాళానికి దిగజారిందన్నారు. ఇది మీ అసమర్థత పాలనకు మరో నిదర్శనం అని పేర్కొన్నారు. గురుకులాలంటే ఎందుకు మీకు అంత చిన్న చూపు రేవంత్ రెడ్డి అని నిలదీశారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి గాడితప్పిన గురుకుల విద్యా వ్యవస్థపై శ్రద్ధ వహించాలని, తక్షణమే గురుకులాల సమస్యలను పరిష్కరించాలని, 2500 మంది కాంట్రాక్ట్, ఔర్ సోర్సింగ్ సిబ్బందికి పెండింగ్ జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.