Drug Peddlers: మైనర్ పిల్లలతో డ్రగ్స్ విక్రయాలు
గంజాయి అమ్ముతూ దొరికిన బాలుడు
ముంబయి గ్యాంగ్ హస్తం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మాదక ద్రవ్యాలపై ఓ వైపు అధికార యంత్రాంగాలు ఉక్కుపాదం మోపుతుంటే, మరోవైపు పెడ్లర్లు (Drug Peddlers) మాత్రం ఎప్పటికప్పుడు రూటు మార్చుతూ దందా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లు కొరియర్ల ద్వారా… డెడ్ డ్రాప్ పద్దతిలో డ్రగ్స్ను సప్లయ్ చేస్తూ వచ్చిన గ్యాంగులు, ఇప్పుడు మాదక ద్రవ్యాలను మైనర్ పిల్లలతో అమ్మించడం మొదలు పెట్టారు. తాజాగా గంజాయి అమ్ముతూ ఓ మైనర్ బాలుడు ఈగల్ ఫోర్స్ అధికారుల చేతికి చిక్కడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మత్తు దందా కోసం గ్యాంగులు ఇంకా ఎంతమంది పిల్లలను ఈ రొంపిలోకి దింపారు? అన్నది తెలుసుకునేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు.
దొరికిన మైనర్ బాలుడు…
ఈగల్ ఫోర్స్ అధికారులు సంజీవరెడ్డినగర్ పోలీసులతో కలిసి జరిపిన ఆపరేషన్లో గంజాయి అమ్ముతూ ఓ మైనర్ బాలుడు దొరికాడు. నేచర్ క్యూర్ ఆస్పత్రి వద్ద పట్టుకున్నారు. బాలుని నుంచి అధికారులు 5 లక్షల రూపాయల విలువ చేసే 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ముంబయికి చెందిన ఓ డ్రగ్ సప్లయింగ్ గ్యాంగ్ పిల్లలతో గంజాయి అమ్మిపిస్తున్నట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో ఇంకా ఎంతమంది పిల్లలను ఈ దందాలోకి దింపారు? అన్నది తెలుసుకునే దిశగా ఈగల్ ఫోర్స్ అధికారులు విచారణ మొదలు పెట్టారు. పట్టుబడిన బాలునికి గంజాయి ఇచ్చిన ముంబయి గ్యాంగ్ కోసం కూడా వేట మొదలు పెట్టారు. ఈ ముఠా సభ్యులు చేతికి చిక్కితే సంచలన వివరాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
బంగారు భవిష్యత్తు ఉన్న వేలాది మందికి డ్రగ్స్ను అలవాటు చేస్తున్న ముఠాలు పదుల సంఖ్యలో ఉన్న విషయం తెలిసిందే. ఈ గ్యాంగులు అమ్ముతున్న డ్రగ్స్కు విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు వైద్య విద్యార్థులు, డాక్టర్లు సైతం బానిసలుగా మారుతున్నారన్న దానికి నిదర్శనంగా ఎన్నో ఉదంతాలు వెలుగు చూశాయి. కొకైన్, ఎండీఎంఏ, హెరాయిన్ తదితర ప్రాణాంతక డ్రగ్స్ దందాలో విదేశీయులే కీలకంగా ఉంటున్నారు. నైజీరియా, టాంజానియా, ఉగాండా తదితర ఆఫ్రికన్ దేశాలకు చెందిన పలువురు స్టూడెంట్, బిజినెస్, టూరిస్ట్ వీసాలపై మన దేశానికి వచ్చి ఏళ్లకు ఏళ్లు అక్రమంగా ఉంటూ పటిష్టమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని మరీ డ్రగ్స్ దందా చేస్తున్నారు. వీరికి ఆయా డ్రగ్స్ సముద్ర మార్గాల చేరుతుండటం గమనార్హం. దేశంలోని వేర్వేరు పోర్టులకు చేరుతున్న డ్రగ్స్ను గోవా, బెంగళూరు, చెన్నై, ముంబయి, హైదరాబాద్ తదితర సిటీలకు చేరవేస్తూ మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వారికి అమ్ముతున్నారు.
ఇక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఏటా వేల కిలోల్లో గంజాయి…వందల లీటర్ల హాష్ ఆయిల్ హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, చెన్నై తదితర సిటీలకు చేరుతోంది. విశాఖ ఏజన్సీ ప్రాంతంతోపాటు ఒడిషా రాష్ట్రం మల్కాన్ గిరి జిల్లాలో వందలాది మంది గంజాయి సాగు చేస్తున్నారు. తక్కువ సమయంలో లక్షలు సంపాదించే అవకాశం ఉండటంతో దీనిని వృత్తిగా చేసుకున్నారు. ఆయా సిటీల్లో గంజాయి దందా చేస్తున్న ముఠాలు ఈ ప్రాంతాలకు వెళుతూ వందల కిలోల్లో గంజాయి…లీటర్ల కొద్ది హాష్ ఆయిల్ తీసుకువచ్చి లోకల్ గా అమ్ముతున్నారు.
డ్రగ్ ఫ్రీ స్టేట్ కోసం…
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక డ్రగ్స్ పై సీరియస్ గా దృష్టిని సారించింది. వేలాది మందిని చావు వైపు నెడుతూ ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిలిస్తున్న డ్రగ్స్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. డ్రగ్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణను మార్చాలని అధికార యంత్రాంగాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని కోసం అవసరమైన అన్ని వనరులను కూడా సమకూరుస్తున్నారు. ఈ క్రమంలో పోలీసు శాఖ మాదక ద్రవ్యాల కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. గత ఒక్క ఏడాదిలోనే 173 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను సీజ్ చేసి 8,322మందిని అరెస్ట్ చేయటం దీనిని స్పష్టం చేస్తోంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే కేవలం అరెస్టులు చేసి నిందితులను జైళ్లకు పంపించటంతోనే అధికారులు ఊరుకుంటుండటం లేదు. ఆయా కేసుల్లో పట్టుబడ్డ వారిలో ఎంతమంది బెయిళ్లపై బయటకు వచ్చారు? ఎక్కడ ఉంటున్నారు? అన్నదాంతోపాటు వారి కదలికలపై నిఘా పెడుతున్నారు. దాంతోపాటు నిందితుల్లో కొందరిని ఇన్ఫార్మర్లుగా మార్చుకుని ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇలా, దర్యాప్తు సంస్థలు ముప్పేట దాడి చేస్తుండటంతో ముఖ్యంగా గంజాయి దందా చేస్తున్న గ్యాంగులు పోలీసుల చేతికి చిక్కకుండా కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి.
Read Als0- First Ticket: పవన్ కళ్యాణ్, బాలయ్య రూ. 5 లక్షలు.. చిరు సినిమాకు ఇంత తక్కువా?
పేద కుటుంబాల పిల్లలతో…
ఈ క్రమంలో నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలతో గంజాయి అమ్మకాలు జరిపిస్తున్నాయి. బస్తీలు, మురికివాడల్లో కాస్త చలాకీగా ఉండే పిల్లల తల్లిదండ్రులను కలుస్తున్న పెడ్లర్లు తాము చెప్పినట్టుగా చేస్తే ప్రతీరోజూ కమీషన్ గా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని తల్లిదండ్రులకు ఆశ పెడుతున్నారు. పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు…మా వెంట మీ పిల్లలను పంపించండి…మేం తీసుకెళ్లిన చోట గంజాయి అమ్మించండి అని చెబుతున్నారు. గంజాయి అమ్మితే వచ్చిన డబ్బులో 10శాతం కమీషన్ గా ఇస్తామని వలలోకి లాగుతున్నారు. అనంతరం నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి ఈ పిల్లలతో అయిదు…పది గ్రాముల చొప్పున ప్యాక్ చేసిన గంజాయి ప్యాకెట్లను అమ్మిపిస్తున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా స్కూల్ బ్యాగులు…సరుకులు తెచ్చే సంచుల్లో ఆ ప్యాకెట్లు పెట్టి పిల్లల చేతికి ఇస్తున్నారు.

