GHMC: ఆ పోస్టులు హాట్ కేక్లు!
జీహెచ్ఎంసీలో పోస్టింగ్లకు పైరవీలు
కుర్చీ ఖాళీ కాకముందు నుంచే ప్రయత్నాలు
డిప్యూటీ కమిషనర్ పోస్టుకు యమ గిరాకీ
ఒక పోస్టుకు నలుగురు అధికారుల ప్రయత్నాలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్రంలోనే అతిపెద్ద స్థానిక సంస్థ అయిన జీహెచ్ఎంసీలో (GHMC) పోస్టింగ్లు హాట్ కేక్లుగా మారాయి. కొన్ని పోస్టులను దక్కించుకునేందుకు వివిధ విభాగాల అధికారులు ఎంతటి ప్రయత్నాలకైనా సిద్దమవుతున్నారు. ముఖ్యంగా సిటీలోని పలు సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్ పోస్టుకు యమ గిరాకీ నెలకొంది. సాధారణంగా ఖాళీగా ఉన్న పోస్టు కోసం అధికారులు సచివాలయం స్థాయిలో, మంత్రుల నుంచి ప్రయత్నాలు చేసుకుంటారు. కానీ జీహెచ్ఎంసీలోని టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్, హెల్త్ తదితర విభాగాల్లో త్వరలో ఖాళీ కానున్న పోస్టుల కోసం అధికారులు ముందస్తు ప్రయత్నాలు చేసుకున్నట్లు సమాచారం. ఇందుకుగానూ ఎవర్ని సంప్రదిస్తే తమకు పోస్టింగ్ దక్కుతుందన్న విషయాన్ని వెతికి మరీ ఆరాతీస్తున్నట్టు తెలిసింది. ఈ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎప్పుడు రిటైర్ అవుతున్నారన్న విషయాన్ని తెలుసుకుని మరీ ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. కొన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్ పోస్టుకు అర డజనుకు పైగా మంది అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా డిప్యూటీ కమిషనర్ మొత్తం సర్కిల్కు బాస్గా వ్యవహారించే అధికారం ఉండడం, సర్కిల్ స్థాయిలోని శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, హెల్త్ ఇతర విభాగాల అధిపతులంతా డిప్యూటీ కమిషనర్ల కిందే విధులు నిర్వహించాల్సి ఉన్నందున, ఆశించిన స్థాయిలో అక్రమార్జన ఉంటుందన్న ఆశతో లక్షలాది రూపాయలు రాజకీయ నేతలకు ఇచ్చి, పోస్టింగ్ దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
Read Also- Indian Techie: భారతీయ టెకీని ఉద్యోగంలోంచి తీసేసి.. మళ్లీ రమ్మని బతిమాలుతున్న కంపెనీ
తొలుత లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి, పోస్టింగ్ను దక్కించుకుని వివిధ విభాగాలకు డిప్యూటేషన్పై వస్తున్న అధికారులు ఆ తర్వాత సక్రమంగా విధులు నిర్వర్తించే మాటను పక్కన బెట్టి, అక్రమార్జనే ప్రధాన లక్ష్యంగా ఎగబడుతున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. డిప్యూటేషన్ గడువు ముగిసినా, జీహెచ్ఎంసీ నుంచి రిలీవ్ కాకుండా మాతృశాఖ అధికారులను మేనేజ్ చేసుకుని నేటికీ కొనసాగుతున్న అధికారులు సైతం లేకపోలేరు. ఇప్పటి వరకు వివిధ సర్కిళ్లలో లంచాలు తీసుకుంటూ దొరుకుతూ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన జీహెచ్ఎంసీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది సర్కిల్ స్థాయిలో విధులు నిర్వర్తించిన వారే ఉండటం ఇందుకు నిదర్శనం. కొంతకాలం క్రితం రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు రెడ్ హ్యాండెడ్గా చిక్కడంతో ఖాళీ అయిన ఆ డిప్యూటీ కమిషనర్ పోస్టు కోసం నలుగురు అధికారులు విశ్వప్రయత్నాలు చేయగా, ఒకరికి ఆ పోస్టు దక్కింది. ఇపుడు ఒకే సామాజిక వర్గానికి చెందిన మరో ముగ్గురు అధికారులు కూడా చందానగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ పోస్టుల కోసం సచివాలయ స్థాయిలో పైరవీలు చేస్తున్నట్లు సమాచారం.
Read Also- Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కొత్త రూల్స్.. రాజకీయ పార్టీలకు ఈసీ కీలక సూచనలు
ట్యాక్స్ స్టాఫ్ది కూడా అదే తీరు
ఇతర విభాగాల నుంచి జీహెచ్ఎంసీలోకి డిప్యూటేషన్ పై వచ్చేందుకు అధికారులు సచివాలయ స్థాయి పైరవీలు, రాజకీయ నేతలతో ప్రయత్నాలు చేస్తుండగా, జీహెచ్ఎంసీ కార్పొరేషన్ కు చెందిన ట్యాక్స్ స్టాఫ్ సిబ్బంది కూడా తాము కోరుకున్న చోట పోస్టింగ్ లను దక్కించుకునేందుకు నచ్చిన చోటే కొనసాగుతున్న వారికి బదిలీలైతే వాటిని ఆపుకునేందుకు రాజకీయ నేతల వద్దనే పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. కొంతకాలం క్రితం జీహెచ్ఎంసీ భారీ ఎత్తున ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు స్థానచలనం కల్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ వీరిలో సగం మంది తమ పాత స్థానంలోనే కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. వీరిలో సుమారు 20 ఏళ్ల నుంచి ఒకే సర్కిల్ గా విధులు నిర్వహిస్తున్న ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు లేకపోలేరు. వీరిలో కొందరు గోషామహాల్ సర్కిల్ లో కొనసాగేందుకు లోకల్ లీడర్ సహాయంతో ఓ మంత్రితో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారికి ఫోన్ చేయించినట్లు సమాచారం. ఈ ఫోన్ చేయించిన ఉద్యోగులను సదరు ఉన్నతాధికారి తీవ్రంగా మందలించినట్లు సమాచారం.
