CM Delhi Tour: తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభినందనలు తెలిపారు. తెలంగాణ భవిష్యత్ ముఖచిత్రాన్ని డాక్యుమెంట్ ఆవిష్కరించిందని వారు కొనియాడారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలను వారి నివాసాల్లో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైన తీరు, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై వారి మధ్య చర్చ కొనసాగింది.
సీఎంకు సంపూర్ణ మద్దతు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాబట్టేందుకు ఒప్పందాలు చేసుకోవడంపై కాంగ్రెస్ అగ్ర నేతలు సీఎం రేవంత్ ను ప్రశంసించారు. రాష్ట్రాభివృద్ధికి ఇలాంటి మరెన్నో వినూత్న చర్యలను చేపట్టాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలకు పార్టీ హైకమాండ్ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం ఖర్గే, ప్రియాంక స్పష్టం చేశారు. ఖర్గే, ప్రియాంకలను కలిసిన సందర్భంలో సీఎం రేవంత్ వెంట మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు సురేశ్ షెట్కార్, మందాడి అనిల్ కుమార్, పోరిక బలరాం నాయక్, డాక్టర్ మల్లు రవి, కుందూరు రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ ఉన్నారు.
రెండేళ్ల పాలనపై వివరణ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ బిజీ బిజీగా గడిపారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేను కలిశారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలుపై అగ్రనేతలకు వివరణ ఇచ్చారు. అలాగే గ్లోబల్ సమ్మిట్ విజయవంతం, పెట్టుబడుల వివరాలను కాంగ్రెస్ అగ్రనేతలకు తెలియజేశారు. రాష్ట్రాభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి విజన్ చూసి సోనియా, రాహుల్ సైతం మెచ్చుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం దిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలు దేరారు.
Also Read: Road Accident: పొగ మంచు ఎఫెక్ట్.. అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. స్పాట్లోనే..!
సమ్మిట్.. సూపర్ సక్సెస్
ఇదిలా ఉంటే హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 9, 10 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహించింది. ఈ సందర్భంగా పరిశ్రమలు, ఐటీ(IT), పవర్(Power), స్పోర్ట్స్(Sports), టూరిజం, ఫారెస్ట్ తదితర రంగాల్లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. సమ్మిట్ జరిగిన రెండు రోజుల వ్యవధిలో మొత్తం రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు వివిధ కంపెనీలు, పరిశ్రమలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తొలి రోజు రూ. 2,00,043 కోట్లు రాగా.. రెండో రోజు రూ. 2,96,495 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

