Local body elections: ఆర్డినెన్స్ ఆమోదం పొందినా హడావుడి లేనివైనం
ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు పూర్తి
ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురుచూపులు
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections) నోటిఫికేషన్ కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఎన్నికల సంఘం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. రోజు రోజుకు క్షేత్రస్థాయిలో జరిగే పరిణామాలపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా అధికారులు సిద్ధం చేశారు. అంతేకాకుండా ఓటర్ తుది జాబితాను కూడా ప్రకటించారు. ఇప్పటికే రెండు సార్లు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ విడుదల చేశారు. ఆ ప్రక్రియ ముగిసినప్పటికి నోటిఫికేషన్ పడకపోవడంపై అనుమానాలకు తావిస్తోంది. గతకొంత కాలంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకు ఎన్నికలు నిర్వహించబోమని ప్రభుత్వం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన 42 శాతం బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం తెలిపారు. అయినప్పటికీ నోటిఫికేషన్పై ప్రభుత్వం పునరాలోచనలో పడింది.
సిద్ధంగా రిజర్వేషన్ లెక్కలు
ఇప్పటికే ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు, రిజర్వేషన్ ప్రక్రియపై అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆదేశిస్తే తక్షణమే వివరించేందుకు రిజర్వేషన్ గణాంకాలను తాత్కాలికంగా అధికారులు నిర్ణయిస్తున్నారు. జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్ రాష్ట్ర యూనిట్గా చేసే అవకాశం ఉంటుంది. అదే జడ్పీటీసీ, ఎంపీపీలు జిల్లా యూనిట్గా, ఎంపీటీసీలు, సర్పంచ్లు మండలం యూనిట్గా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకు పూర్తి విరుద్ధంగా ఉండే అవకాశమున్నట్లు సమాచారం. జనరల్ రిజర్వేషన్ కేటాయించిన స్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు పోటీ చేసే అవకాశం ఉంటుందా?, లేదా? అనే అనుమానాలపై ప్రజల్లో చర్చ నడుస్తోంది. గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత గ్రామాలలో హడావుడి లేకపోవడంతో ఎన్నికలు జరుగుతాయా?, లేదా? అనే చర్చ కూడా జోరుగా వినబడుతోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ నెలాఖరి వరకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. కానీ, ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోకపోవడంపై చర్చ తీవ్రంగా కొనసాగుతోంది.
Read Also- Ind vs Pak Match: పాకిస్థాన్తో మ్యాచ్లో నిరసనకు సిద్ధమవుతున్న టీమిండియా ప్లేయర్లు!
రంగారెడ్డిలో తగ్గిన ఎంపీటీసీలు…
ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మున్సిపాలిటీ, కార్పొరేషన్ ప్రక్షాళనలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు హెచ్చుతగ్గులకు గురయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు లేకుండా అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో జడ్పీటీసీ స్థానాల్లో మార్పులు లేకపోగా ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. మున్సిపాలిటీలకు సమీపంలో ఉన్న గ్రామాలను పురపాలికల్లో విలీనం చేయడంతో ఎంపీటీసీల స్థానాలు బాగా తగ్గాయి. రంగారెడ్డిలో 21 జడ్పీటీసీలుండగా 258 ఎంపీటీసీ స్థానాలకు 230కి కుదించారు. అదేవిధంగా, వికారాబాద్ జిల్లాలో గతంలో 17 జడ్పీటీసీలు 224 ఎంపీటీసీలు ఉండగా, ప్రస్తుతం 20 జెడ్పీటీసీలు, 227 ఎంపీటీసీలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్, సరూర్నగర్, బాలాపూర్, హయత్ నగర్, శేరిలింగంపల్లి, గండిపేట మండలాలను పూర్తిగా అర్బన్ మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎంపిటిసిలు, జడ్పిటిసిలు లేవు.
Read Also- Narendra Modi: నేను శివ భక్తుడిని.. దూషణల విషాన్ని కూడా తాగగలను: ప్రధాని మోదీ
ముందుకురాని ఆశావహులు
అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు జంకుతున్నారు. పోటీ చేయాలనే ఆశలున్నా నేరుగా చెప్పేందుకు భయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు యూరియా అందడం లేదనే అపవాదను కాంగ్రెస్కు కట్టే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు అవలంభించే అభివృద్ధి విధానాలను ఎత్తి చూపెందుకు అధికార పార్టీ నాయకులు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికార పార్టీ పై ఎంత వ్యతిరేకత కలిగించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం ఉండకపోవచ్చు అనే చర్చ సాగుతుంది. ఎవ్వరికీ వారు తమ పార్టీలను బలోపేతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. నోటిఫికేషన్ వస్తే ఎన్నికల హడావుడి కనిపించే అవకాశం ఉంది.