CM Revanth Reddy: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎల్ఈడీ వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకే అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రామాల్లో అవసరమైనన్ని కొత్త ఎల్ఈడీ లైట్లను అమర్చటంతో పాటు వాటిని సమర్థంగా నిర్వహించే నిర్వహణ అధికారం గ్రామ పంచాయతీల పరిధిలోనే ఉండాలని స్పష్టం చేశారు.
ప్రతీ పోల్పై సర్వే
సోమవారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మున్సిపల్, పంచాయతీ రాజ్, జీహెచ్ఎంసీ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్రామాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎల్ఈడీ లైట్లు వెలుగుతున్నాయా లేదా చూడాలని అధికారులను కోరారు. కొత్తగా ఎన్ని అవసరమున్నాయో పక్కాగా అంచనా వేయాలని, ప్రతి పోల్ సర్వే చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. రాత్రి పూట ఎల్ఈడీ లైట్లు పని చేయటంతో పాటు పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ ఉండాలని, అన్ని గ్రామాల ఎల్ఈడీ డ్యాష్ బోర్డు మండల స్థాయిలో ఎంపీడీవో పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు. జిల్లాలో అడిషనల్ కలెక్టర్ కు ఈ బాధ్యతలు అప్పగించాలన్నారు.
మున్సిపల్, పంచాయతీ రాజ్, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించాను.
వీధి దీపాల నిర్వహణ కోసం టెండర్లు పిలవాలని ఆదేశించాను. వీధి దీపాలకు సోలార్ పవర్ ను వినియోగించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి సూచించాను. ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని, రాష్ట్రం లోని అన్ని… pic.twitter.com/reAuGTmm6E
— Revanth Reddy (@revanth_anumula) September 15, 2025
గ్రామాల్లో 16 లక్షల ఎల్ఈడీలు
మరోవైపు రాష్ట్రంలోని అన్ని గ్రామాల పరిధిలో 16.16 లక్షల ఎల్ఈడీ లైట్లున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. వరంగల్, నల్గొండ, జనగాం, నారాయణపేట జిల్లాల్లో ఎల్ఈడీ లైట్ల కాంట్రాక్టు ఏజెన్సీ అధ్వర్యంలో ఉందని తెలియజేశారు. అన్ని గ్రామాల్లో సర్పంచులకే వీటిని అప్పగిస్తే.. లైట్ల నిర్వహణ, విద్యుత్తు దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని ఎల్ఈడీ లైట్లను హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 5.50 లక్షల ఎల్ఈడీ లైట్లు ఉన్నాయని, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ సిటీని కూడా కలిపితే మొత్తం 7.50 లక్షల లైట్లు అవసరమవుతాయని మున్సిపల్ శాఖ సీఎంకు నివేదించింది.
టెండర్లు పిలవాలని ఆదేశం
గతంలో ఉన్న ఏజెన్సీ కాంట్రాక్టు ముగియటంతో ఇప్పుడు చాలాచోట్ల లైట్లు వెలగటం లేదని, నిర్వహణ కూడా సరిగా జరగలేదని అధికారులు సీఎంకు నివేదించారు. కోర్ అర్బన్ సిటీ పరిధిలో జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా చేరిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఎల్ఈడీ లైట్ల అవసరాన్ని అంచనా వేయాలని సీఎం ఆదేశించారు. కొత్తగా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, నిర్వహణకు టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎల్ఈడీ లైట్ల తయారీలో పేరొందిన కంపెనీలను ఆహ్వనించాలని, ఏడేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు కంపెనీలకు అప్పగించాలని, నిర్వహణ పక్కగా ఉండేందుకు వీలుగా టెండర్ నిబంధనలను రూపొందించుకోవాలని సీఎం సూచించారు.
Also Read: Vijayawada Hotel: టిఫిన్ హోటల్లో దారుణం.. దోశ ఆర్డర్ మారింది.. మెడ ఘోరంగా తెగింది!
ప్రతీ నెల రూ.8 కోట్ల బిల్లు
ఎల్ఈడీ లైట్లతో పాటు కంట్రోల్ బాక్స్ ల ఏర్పాటు, నిరంతరం అవి పనిచేస్తున్నాయా లేదా, ఏయే ప్రాంతాల్లో ఇబ్బందులున్నాయో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వ్యవస్థ ఉండాలని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని సూచించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాలకు ప్రతి నెలా రూ.8 కోట్ల కరెంటు బిల్లు చెల్లించాల్సి వస్తుందని, విద్యుత్తు ఆదా చేసేందుకు సోలార్ పవర్ వినియోగించే అంశాన్ని, అందుకు అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. కోర్ అర్బన్ సిటీ ఏరియాతో పాటు అవుటర్ అవతల ఉన్న మున్సిపాలిటీల్లోనూ ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలతో పాటు కొన్ని మున్సిపాలిటీల్లో కొత్త గ్రామాల విలీనం, గ్రామాల మార్పులు చేర్పులు జరిగాయని అన్నారు. వాటన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఎల్ఈడీ లైట్ల అంచనా వేయాలని సీఎం సూచించారు.