Jubilee Hills bypoll: కారు షెడ్డుకు పోతే, బిల్లా రంగాలు ఆటోల్లో తిరుగుతున్నారు
పదేళ్లు జూబ్లీహిల్స్ను పట్టించుకోలేదు
పీజేఆర్ వారత్వాన్ని నవీన్ కొనసాగిస్తాడు
బోరబండకు పీజేఆర్ పేరు
30 వేల మెజార్టీతో గెలిపించాలి
సంక్షేమం, అభివృద్దే లక్ష్యం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: సానుభూతితో బీఆర్ఎస్ ఓట్లు దండుకోవాలని చూస్తుందని, ఎట్టిపరిస్థితుల్లో మోసపోవద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills bypoll) ప్రచారంలో భాగంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బొరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలు నిర్వహించిన అనంతరం కార్నర్ మీటింగ్లలో సీఎం మాట్లాడారు. గత సంప్రదాయాలను తుంగలో తొక్కింది కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు. 2007 లో పీజేఆర్ ఆకస్మికంగా చనిపోతే, ఆ స్థానాన్ని ఏకగ్రీవంగా చేయాలంటే, అభ్యర్థిని పెట్టి ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్ అని రేవంత్ మండిపడ్డారు. అంతేగాక పీజేఆర్ కుటుంబాన్ని 3 గంటలు బయట నిలబెట్టి కేసీఆర్ అవమానించాడన్నారు. ఇది అత్యంత దారుణమని తెలిపారు. పీజేఆర్ వారసత్వాన్ని నవీన్ యాదవ్ కొనసాగిస్తారని, అందుకే 30 వేల మెజార్టీతో గెలిపించాలని సీఎం కోరారు.
ప్రస్తుతం కారు షెడ్డుకు పోయిందని, బిల్లా, రంగాలు ఆటోల్లో తిరుగుతున్నారని విమర్శించారు. పదేళ్లు పవర్లో ఉండి జూబ్లీహిల్స్లో సమస్యలు పేరుకుపోవడానికి కారణం ఎవరు? అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఈ ప్రాంతంలోని మైనార్టీల సమస్యలు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే 70 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. బస్తీల్లో రేషన్ కార్డులు అందజేశామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. ఇంకా సంక్షేమం, డెవలప్ చేయాల్సి ఉన్నదన్నారు. ప్రజలు ఆశీర్వాదాలుఉంటే తప్పక ముందుకు సాగుతామన్నారు.
Read Also- MLA Kaushik Reddy: నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్
సొంత చెల్లిని బయటకు పంపినోడు
ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలిని ఇంటి నుంచి పంపిన కేటీఆర్ …సునీతమ్మను మంచిగా చూసుకుంటాడా? అని ప్రశ్నించారు. సొంత చెల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మ కూతురికి బంగారు గాజులు పెడతారంటే నమ్ముతారా? అని ప్రజలను ప్రశ్నించారు. కంటోన్మెంట్ ఉపఎన్నికలో శ్రీ గణేష్ ను గెలిపించగానే ఆ నియోజకవర్గాన్ని 4 వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అందుకే జూబ్లీహిల్స్ లో అభివృద్ధి జరగాలంటే నవీన్ యాదవ్ ను గెలిపించాలన్నారు. ఇక అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే కిషన్ రెడ్డి జాగీర్ ఏమైనా పోతుందా? ఎందుకు అడ్డుకోవాలని చూశారు? అని సీఎం ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆరెస్ పనిచేసిందని, ఇప్పుడు బీజేపీ వాళ్లు బీఆరెస్ ను గెలిపించేందుకు పనిచేస్తున్నారన్నారు. కేంద్రంలో ప్రతీ సందర్భంలో మోదీకి కెసీఆర్ మద్దతు పలికారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మైనారిటీలకు మేలు జరుగుతుందన్నారు. జూబ్లీహిల్స్ ప్రజల అభివృద్ధికి నవీన్, మంత్రి అజారుద్దీన్ అండగా ఉంటారన్నారు.
Read Also- Medak District: ఘనంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ జన్మదిన వేడుకలు
బోరబండకు పీజేఆర్ పేరు…
జూబ్లీహిల్స్ లోని ఏ బస్తీల్లోని తలుపు తట్టినా పీజేఆర్ సాయం పొందినవారే ఉంటారని సీఎం గుర్తు చేశారు. బోరబండ చౌరస్తాకు పీజేఆర్ పేరు పెట్టాలని అడుగుతున్నారని, విజయయాత్రకు మళ్లీ వస్తానని చెప్పారు. ఈ చౌరస్తాకు పీజేఆర్ చౌరస్తాగా పేరు పెట్టుకుందామన్నారు. ఈ ప్రాంతంలో పుట్టిపెరిగిన నవీన్ ను గెలిపిస్తే, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తానే తీసుకుంటానని వివరించారు. బస్తీల్లోని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చే బాధ్యత తీసుకుంటాడన్నారు. వందల కోట్లతో బస్తీలు డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు. పేదలకు రేషన్ కార్డులు, 200 యూనిట్ల విద్యుత్ ను అందిస్తామన్నారు. మహిళలంటే బీఆర్ ఎస్ మర్యాద లేదని, అందుకే 2014 నుంచి ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. కానీ తమ ప్రభుత్వంలో సీతక్క, కొండా సురేఖ లకు మంత్రి పదవులు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
