CM on SLBC Project: మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ దురుద్దేశంతోనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ (SLBC Project)ను పక్కన పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్ట్ పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న భయంతో కేసీఆర్ గత పదేళ్లు ప్రాజెక్టును పట్టించుకోలేదని అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా మన్నెవారిపల్లిలో పర్యటించిన సీఎం రేవంత్.. అక్కడ ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ పట్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభించిన వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.
30 టీఎంసీలు.. 3 లక్షల ఎకరాలు
మన్నెవారిపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ’30 టీఎంసీల తరలింపు, 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో 1983లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మంజూరైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2004 లో వైఎస్ రాజశేఖరరెడ్డి టన్నెల్-1, టన్నెల్-2 పనులను ప్రారంభించారు. రూ. 1968 కోట్లతో టెండర్లు ఇచ్చారు. టన్నెల్ బోర్ మిషన్ ను దేశంలోనే తొలిసారి ఎస్ఎల్బీసీ టన్నెల్ కు ఉపయోగించారు. 2014 వరకు టన్నెల్ పనులు బాగానే జరిగాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత పదేళ్లలో పది కి.మీ కూడా కేసీఆర్ పూర్తిచేయలేదు. రాజకీయ దురుద్దేశంతో హరీష్, కేసీఆర్ ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టారు. గ్రావిటీ ద్వారా నల్గొండకు నీళ్లు తీసుకెళ్లాలని భావిస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు’ అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ఆ ఘనత తెలంగాణదే
ప్రపంచంలో 40 కి.మీ పొడవైన టన్నెల్ ఎక్కడా లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది ఎస్ఎల్బీసీ పూర్తయితే ఆ ఘనత తెలంగాణకు దక్కుతుందని పేర్కొన్నారు. ‘ఆనాడు రూ.2 వేల కోట్లు ఖర్చుతో ఈ ప్రాజెక్టు పూర్తయ్యేది. ఇప్పుడు పెరిగిన అంచనాలతో రూ.4,600 కోట్లతో ఈ టన్నెల్ ను పూర్తి చేయొచ్చు. ఎస్ఎల్బీసీ సహా కృష్ణా నదిపై ఏ ఒక్క ప్రాజెక్టును గత ప్రభుత్వం పూర్తి చేయలేదు. కేసీఆర్ పదేళ్లలో రూ.1 లక్షా 86 వేల కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారు. అందులో రూ.1 లక్షా 5 వేల కోట్లు కాళేశ్వరం కోసమే ఖర్చు చేశారు. కృష్ణాలో మన వాటా మనం తీసుకోకపోవడం వల్ల ఆ నీటిని ఆంధ్రా తరలించుకు పోతోంది’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఎస్ఎల్బీసీ ప్రమాదంపై..
కృష్ణాలో 299 టీఎంసీలు తెలంగాణకు చాలని ఆనాడు హరీష్ సంతకం పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ‘మన వాటా మనకు దక్కాల్సిందేనని ట్రిబ్యునల్ లో మేం వాదనలు వినిపిస్తూ ఒక కొలిక్కి తీసుకొస్తున్నాం. ఇంత తక్కువ ఖర్చుతో 30 టీఎంసీలు తీసుకు వెళ్లే ప్రాజెక్టు ఎక్కడా లేదు. మేం అధికారంలోకి వచ్చాక పనులు మొదలు పెట్టాం. దురదృష్టవశాత్తు 8 మంది కార్మికులు చనిపోయారు. మాకు బాధ ఉన్నా.. ఆ కుటుంబాలను ఆదుకుని పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నంచేస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆర్మీలో ఉన్న పరిచయాలతో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. హరీష్ రావు చిల్లర మాటలు మానుకోవాలి. తప్పులు – అప్పులు చేసి దోపిడీ చేశారనే ప్రజలు మిమ్మల్ని పక్కనబెట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ఇక్కడి ప్రజలు మమ్మల్ని క్షమించరు. ఎట్టిపరిస్థితుల్లో పూర్తి ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: Rajasthan Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది స్పాట్ డెడ్.. 50 మందికి పైగా గాయాలు
ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ
మరోవైపు ముంపునకు గురవుతున్న మర్లపాడు, కేశ్య తండా, నక్కలగండి తండా ప్రజలను ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. డిసెంబర్ 31 లోగా సమస్యలు పరిష్కరించే బాధ్యత తమదని అన్నారు. ‘ఇప్పుడు కాకపోతే ఈ ప్రాజెక్టును ఇంకెప్పుడూ పూర్తి చేసుకోలేం. ఎన్ని అడ్డంకులు వచ్చినా తొలగొంచుకుని ప్రాజెక్టు పూర్తి చేసుకుందాం. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోకపోతే నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలకు నష్టం కలుగుతుంది’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
