CM Revanth Reddy: 100 రోజుల్లో మేడారం అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో సోమవారం మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు వివరించారు. మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మేడారం మహాజాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. పూర్తిగా సహజసిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
Also Read: Actress Navya Nair: నటికి బిగ్ షాక్.. మల్లెపూలు పెట్టుకుందని.. ఏకంగా రూ.1.14 లక్షల ఫైన్
క్షేత్రస్థాయి పరిశీలన చేస్తాం
భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులు ఉండాలన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలిచేలా ఏరియాలవారీగా చెక్ డ్యామ్ ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ వారంలో మేడారంకు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తానని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయ విస్తరణ, అభివృద్ధికి సంబంధించిన పలు సూచనలు సీఎం చేశారు. అన్ని దేవాలయాల అభివృద్ధికి సంబంధించి స్థానిక సెంటిమెంట్ ను గౌరవించడంతోపాటు, స్థానిక నిపుణులు, పూజారుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా సమ్మక్క, సారలమ్మ ఆలయ ఆధునీకరణ
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు అవసరమైన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేపడతున్నామని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా గిరిజనుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ ఆధునీకరణను చేపడుతున్నామని తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డి సూచన మేరకు ఈ పనులను ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభించి జనవరి మొదటి వారంలోగా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే మేడారం ఆలయాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారన్నారు. మూడు నెలల వ్యవధిలో పనులు పూర్తయ్యేలా ఆదేశించారని తెలిపారు. వారం రోజుల్లో ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్ధాయి పరిశీలనకు వస్తున్నందున తగు ప్రణాళికలు, సమాచారంతో సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: Viral Video: 52 ఏళ్లకు తండ్రి ఎంబీఏ పూర్తి.. కొడుకు ఇచ్చిన సర్ ప్రైజ్ పార్టీకి.. సోషల్ మీడియా షేక్!