CM Revanth Reddy: హైదరాబాద్ లో తాగునీటి ఎద్దడి లేకుండా చూసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2, 3 ప్రాజెక్టుకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గండిపేట వద్ద శంకుస్థాపన చేశారు. రూ.7,360 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాటారు. 1908లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి నిజాం ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలను వరదల నుంచి కాపాడిందని సీఎం రేవంత్ అన్నారు.
ఆ ఘనత కాంగ్రెస్దే: సీఎం రేవంత్
హైదరాబాద్ కు గడిచిన వందేళ్లుగా తాగు నీరు అందుతున్నాయంటే ఆనాటి నిజాం సర్కార్ దూరదృష్టినే కారణమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయి. 1965లో మంజీరా నది నుంచి నగరానికి తాగు నీరు అందించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 2002లో కృష్ణా నదీ జలాలను మూడు దశల్లో నగరానికి తరలించి ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలది. కాంగ్రెస్ తెచ్చిన గోదావరి జలాలను నెత్తి మీద చల్లుకుని తామే ఏదో చేసినట్టు కొందరు నమ్మించారు. నెత్తిమీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన వాళ్ల పాపాలు తొలగిపోవు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే గోదావరి జలాల తరలింపునకు ముందడుగు పడింది’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
‘మూసీని ప్రక్షాళన చేస్తాం’
మరోవైపు కాలుష్యమయంగా మారిన మూసీతో నల్లగొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘విషతుల్యమైన మూసీని ప్రక్షాళన చేస్తానని నల్లగొండ జిల్లా ప్రజలకు ఆనాడే మాట ఇచ్చా. 20 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్ కు తరలించబోతున్నాం. ఇందులో 16 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి కోసం వినియోగించబోతున్నాం. చెరువులను నింపుకుంటూ 4 టీఎంసీలను మూసీకి తరలించి మూసీని ప్రక్షాళన చేస్తాం. శ్రీపాద ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాలను హైదరాబాద్ తరలిస్తున్నాం. ఆ సంగతి మరిచిపోయి కొందరు మల్లన్నసాగర్ అని మాట్లాడుతున్నారు’ అని సీఎం అన్నారు.
Also Read: Viral Video: 52 ఏళ్లకు తండ్రి ఎంబీఏ పూర్తి.. కొడుకు ఇచ్చిన సర్ ప్రైజ్ పార్టీకి.. సోషల్ మీడియా షేక్!
‘ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొడతాం’
చేవెళ్లలో వైఎస్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాసుల కక్కుర్తితో బీఆర్ఎస్ రూపురేఖలు మెుత్తం మార్చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘చేవెళ్ల, తాండూరు, పరిగికి సాగునీరు అందకపోవడానికి కారణం మీరు కాదా. తుమ్మిడిహెట్టీ దగ్గర ప్రాణహిత చేవెళ్ల కట్టి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తాం. గంగా నదీ, యమునా, సబర్మతీ నదులు ప్రక్షాళన చేయొచ్చు. కానీ మేం మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దా. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేపట్టలేదు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తాం. అభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరుతున్నా. తెలంగాణ రైసింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ 9 న తెలంగాణ సమాజానికి అంకితం ఇవ్వబోతున్నాం. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మా ప్రభుత్వం తిప్పికొడుతుంది. నగర అభివృద్ధిలో అందరూ కలిసిరండి’ అని రేవంత్ పిలుపునిచ్చారు.