CM Revanth Reddy: యంగ్ ఇండియా తన బ్రాండ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఎందరో ప్రధానులు, ముఖ్యమంత్రులయ్యారని కానీ వారిలో కొంతమందే చరిత్రలో స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. చరిత్రను మలుపుతిప్పే నిర్ణయాలు తీసుకోవడమే ఇందుకు కారణమని వివరించారు. ఆయన రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో నూతనంగా నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రెండు రూపాయలకే కిలోబియ్యం ఇచ్చి ఎన్టీఆర్ పేదప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. హైదరాబాద్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి చంద్రబాబు ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకున్నారని వివరించారు. ఉచిత విద్యుత్ సహా పలుసంక్షేమ పథకాలను అమలు చేయటం ద్వారా వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు బాంధవునిగా గుర్తుండి పోయారన్నారు.
Alos Read: Sama Rammohan:హెచ్ సీయూ రగడ.. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ సరికొత్త సవాల్!
ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ వంటి అంశాల్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు చిరస్మరణీయులయ్యారని కొనియాడారు. ప్రస్తుతం ప్రపంచదేశాలతో భారత్ పోటీపడుతున్నదంటే అందుకు కారణం పీవీయేనని పేర్కొన్నారు. తాను స్కిల్ వర్సిటీని స్థాపించి నిరుద్యోగులకు నైపుణ్యాలు నేర్పించి చరిత్రలో నిలిచిపోదామనుకుంటున్నానని చెప్పారు.
మహాత్మా గాంధీ స్ఫూర్తితో..
తాను మహాత్మా గాంధీ స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ తీసుకొచ్చానని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందన్నారు. అందుకే విద్య, ఉపాధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు. ఏటా లక్షమందికిపైగా ఇంజినీరింగ్ పట్టాలు తీసుకుని కాలేజీల నుంచి బయటకు వస్తున్నారని కానీ వీరికి నైపుణ్యాలు లేకపోవడంతో ఉద్యోగాలు దొరకడం లేదన్నారు.
నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యాలు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీని స్థాపించినట్టు తెలిపారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను ఈ వర్సిటీకి చైర్పర్సన్గా నియమించుకున్నామన్నారు. స్కిల్ వర్సిటీలో చేరిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉందన్నారు. దేశంలోనే అత్యుత్తమ వర్సిటీగా దీనిని తీర్చి దిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. దేశ మొదటి ప్రధాని నెహ్రూ హయాంలోనే దేశంలో యూనివర్సిటీలకు బీజం పడిన విషయాన్ని గుర్తు చేశారు.
ఒలంపిక్స్లో మనకెందుకు పతకాలు వస్తలేవు
140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒలింపిక్స్లో ఒక్క బంగారు పతకాన్ని కూడా గెలవకపోవటం బాధాకరమన్నారు. అందుకే వచ్చే ఒలింపిక్స్లో పతకాలు గెలవడమే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. వీటిల్లో చేరే క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ అందేలా చూస్తామన్నారు.
ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్స్కూళ్ల కన్నా ప్రభుత్వ బడుల్లో ఎక్కువ విద్యార్హతలు ఉన్న టీచర్లు ఉన్నారని చెప్పారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. దీనికి కారణం ప్రాథమిక స్థాయిలోనే పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్చుకోకపోవటమేనని చెప్పారు.
మౌలిక వసతులు లేకపోవటం మరో కారణమన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటంతోపాటు ప్రాథమిక స్థాయిలోనే పిల్లలను చేర్చుకునే దిశగా చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. అందుకే ఒకటో తరగతి నుంచి ఉన్న ప్రభుత్వ స్కూళ్ల విధానంలో మార్పులు తెచ్చి ప్రీ స్కూల్ అడ్మిషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
Also Read: CS Shanti Kumari: శాంతికుమారికి షాక్ తప్పదా? కొత్త సీఎస్ పోస్టు ఎవరిది?
సైనిక్ స్కూళ్లకు దీటుగా ..
సైనిక్ స్కూళ్లకు దీటుగా పోలీస్ స్కూళ్లను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఇందుకు కావాల్సిన నిధులు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. యంగ్ ఇండియా పోలీస్స్కూల్ను ఆదర్శంగా తీర్చిదిద్దడం అందరి బాధ్యత అన్నారు. సామాజిక బాధ్యతగా కార్పొరేట్ కంపెనీలు పోలీస్స్కూళ్లకు ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
పోలీస్స్కూళ్ల కోసం రూ.100 కోట్లతో కార్పస్ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. దీని కోసం ఎవరితోనైనా మాట్లాడాల్సి ఉంటే తనకు చెప్పాలని, స్వయంగా మాట్లాడుతానని అన్నారు. ఈ ఫండ్ను ఎలా సద్వినియోగం చేసుకోవాలన్నది మీరే నిర్ణయించుకోవాలని చెప్పారు. ఇందుకు అవసరమైన అన్ని అనుమతులు ఇస్తామన్నారు.
పోలీస్శాఖలో పనిచేసే హోంగార్డు మొదలుకుని డీజీపీ స్థాయి అధికారి వరకు అందరికీ యంగ్ ఇండియా పోలీస్స్కూల్ ఉపయోగపడుతుందన్నారు. స్కూల్ ప్రారంభానికి ముందు విద్యార్థులతోకలిసి సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు ఫుట్బాల్ ఆడారు. కార్యక్రమంలో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, గ్రేహౌండ్స్ అదనపు డీజీ స్టీఫెన్ రవీంద్రతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు