Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్య ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్రెడ్డి మంగళవారం వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), ఆమ్ ఆద్మీ పార్టీ, మజ్లిస్ (ఎంఐఎం) తదితర పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో సీఈవో మాట్లాడుతూ రాబోయే ఉప ఎన్నికలు ముఖ్య ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ప్రవేశపెట్టిన కొత్త ఎన్నికల సంస్కరణలతో నిర్వహించబడనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ ఎలక్షన్ నుంచే అమలు
ఈ సంస్కరణలు తొలిసారిగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో అమల్లోకి వస్తాయని సీఈఓ సి. సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ సంస్కరణలు.. ఓటర్ల సౌకర్యం, పారదర్శకత, ఎన్నికల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తాయన్నారు. ఈ సమావేశంలో అదనపు సీఈవో లోకేష్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, ఉప సీఈవోలు హరి సింగ్, సత్యవాణి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: Watch Video: నదిలో స్నానం చేస్తుండగా.. మహిళను ఎత్తుకెళ్లిన మెుసలి.. వీడియో వైరల్
ఇంతకీ ఏంటా సంస్కరణలు?
❄️ ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా ఏర్పాట్లు
❄️ ఓటర్లు తమ అభ్యర్థులను సులభంగా గుర్తించేందుకు ఈవీఎంలపై రంగు ఫోటోలు ఉంచడం.
❄️ మహిళా ఓటర్ల సౌలభ్యాన్ని మరింత పెంచేందుకు మహిళా సిబ్బందిని అదనంగా నియమించడం.
❄️ వృద్ధులు , దివ్యాంగుల కోసం వీల్చెయిర్లు, ర్యాంపులు, పిక్-అప్/డ్రాప్ సదుపాయాలు.
❄️ రియల్టైమ్ ఓటింగ్ టర్నౌట్ మానిటరింగ్ కోసం డిజిటల్ డ్యాష్బోర్డులు, మొబైల్ యాప్లు.
❄️ సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో కృత్రిమ మేధస్సు ఆధారిత పర్యవేక్షణ, జీపీఎస్ ట్రాకింగ్.
❄️ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) ఉల్లంఘనలపై కఠిన చర్యలు, టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ.
❄️ పర్యావరణహిత ఎన్నికలు — పేపర్ వినియోగం తగ్గించడం, డిజిటల్ సమాచార మార్పిడి ప్రోత్సాహం.
