Naveen Yadav: ఎన్నికల కోడ్ ఉల్లంఘించి బెదిరింపులు
ఓట్లు రాబట్టేందుకు నేతలు బెదిరింపు
స్వేచ్ఛగా ఓట్లు వేసేందుకు ఎన్నికల కమిషన్ కృషి చేయాలి
ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తున్న నవీన్ యాదవ్పై (Naveen Yadav) చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి గురువారం బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది. వారం రోజుల్లో బీఆర్ఎస్ కేడర్ను లేకుండా చేస్తా అని నవీన్ యాదవ్ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ , కె. కిశోర్ గౌడ్ మాట్లాడారు. బీఆర్ఎస్ క్యాడర్ను బెదిరించడం రాజ్యాంగ విరుద్ధమని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు అవుతుందన్నారు. బెదిరింపు చర్యలకు పూనుకుంటున్న నవీన్ యాదవ్పై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎన్నికల కమిషన్పై తమకు విశ్వాసం ఉందని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఓట్లు రాబట్టేందుకు నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. స్వేచ్ఛగా ఓట్లు వేసేందుకు ఎన్నికల కమిషన్ కృషి చేయాలన్నారు. ఇది ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి బెదిరింపు ధోరణి తో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను పోటీ నుంచి తప్పించాలని, ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు నోటీస్ ఇస్తామని ఎలక్షన్ కమిషన్ సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామచంద్రు నాయక్ ,ఉపేంద్రా చారి పాల్గొన్నారు.
Read Also- Rayaparthi MPDO: ఎంపీడీవోపై టైపిస్ట్ ఆరోపణలు.. గ్రామపంచాయతీ కార్యదర్శుల ప్రెస్మీట్.. ఏంటీ వ్యవహారం?
మైనార్టీలపై బీజేపీ, బీఆర్ఎస్ విద్వేషం: ఎంపీ చామల
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ కేబినెట్లో కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ నేత, భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్కు చోటు కల్పిస్తుంటే ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్రలు పన్నుతున్నాయంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచే కులమతాలన్నీ కలిసి కట్టుగా ఉండాలని చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా లౌకిక వాదంతో ముందుకు పోవాలన్న కాంగ్రెస్ పార్టీ ఆలోచనే ఇప్పటికీ దేశాన్ని సమైక్యంగా ఉంచిదన్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ, ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్న విషయాన్ని అందరూ గమనించాలన్నారు.
Read Also- Book My Show: ‘బాహుబలి ది ఎపిక్’తో మాస్ మహారాజాకు దెబ్బపడేలానే ఉందిగా..
గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు పొందడానికి బీఆర్ఎస్తో చేసుకున్న అంతర్గత ఒప్పందమే కారణమన్నారు.కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదని, రాష్ట్రంలోనూ అధికారంలో ఉండకూడదన్న కుట్రతోనే బీజేపీ, బీఆర్ఎస్ ఏకమయ్యాయన్నారు. ఈ రెండు పార్టీలు గతంలో చేసిన కుట్రలను తాను చెప్పడం కాదని, కేసీఆర్ కూతురైన కవితే ఎన్నో వేదికలపై బయటపెట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు ఓటర్లు ఉన్నారన్న విషయం ఎన్నికల సర్వేల్లో వెల్లడవుతుండడంతో ఆ రెండు పార్టీల్లోనూ కలవరం మొదలయ్యిందని, అందుకే జూబ్లీహిల్స్లో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
