Auto Drivers: ఆటోలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆటో కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపామని పేర్కొంటున్నప్పటికీ గత పదేళ్లలో ఆటో కార్మికులపై నమోదైన కేసులు స్పష్టం చేస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 78వేల211 కేసులు నమోదు అయ్యాయి. అంతేకాదు వారి నుంచి రూ.4271.27లక్షలను జరిమానా రూపంలో వసూలు చేసింది. అదే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆటో కార్మికుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తుండటం చర్చనీయాంశమైంది.
Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా
నేడు ప్రతిపక్షంలో ఉండటంతో గుర్తుకు వస్తున్నారా?
నాడు విస్మరించి.. నేడు ప్రతిపక్షంలో ఉండటంతో గుర్తుకు వస్తున్నారా? అనే పలువురు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి(కేసీఆర్ సీఎంగా) ప్రమాణ స్వీకారం చేసిన 2014 జూన్ 2 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఆటోలపై కేసులు నమోదు కావడం వారి తీసుకున్న చర్యలు స్పష్టం చేస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఆటోలపై78,211 (వెహికిల్ చెక్ రిపోర్ట్స్) కేసులు నమోదు అయ్యాయి. అంటే నెలకు సుమారు 652 కేసులకు పైగా నమోదు అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఏడాదికి సుమారు 7824 కేసులు నమోదు అయ్యాయి. కేసులు నమోదు చేయడం వారి నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగినట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఒక్క హైదరాబాద్లోనే కాంపౌండ్ ఫీజు(సీఎఫ్), టాక్స్తో కలిపి రూ.480.67 లక్షలు ఆటో డ్రైవర్ల నుంచి వసూలు చేశారు.
జిల్లాల వారీగా వివరాలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో కార్మికులపై పదేళ్లలో నమోదు చేసిన కేసులు 78211 కాగా, సీఎఫ్-టాక్స్ రూపంలో రూ.4271.27 లక్షలు వసూలు చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 1789 కేసులు నమోదు చేసి రూ.107.82 లక్షలు, భద్రాద్రా జిల్లాలో 2025 కేసులు రూ.93.54లక్షలు, హనుమకొండ జిల్లాలో 3089 కేసులు రూ.196.42 లక్షలు, హైదరాబాద్లో 13071 కేసులు నమోదు చేసి రూ.480.67లక్షలు, జగిత్యాల జిల్లాలో 617 కేసులు రూ.41.44లక్షలు, జనగాంలో 605 కేసులు రూ.39.36 కేసులు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 288 కేసులు రూ.16.89లక్షలు, జోగులాంబ గద్వాల జిల్లాలో 848 కేసులు రూ.49.98 లక్షలు, కామారెడ్డిలో 1360 కేసులు రూ.70.62 లక్షలు, కరీంనగర్లో 3133 కేసులు రూ.174.67 లక్షలు, ఖమ్మం జిల్లాలో 4614 కేసులు రూ.216.88లక్షలు, కొమురం భీం జిల్లాలో 868 కేసులు రూ. 49.02 లక్షలు, మహబూబ్నగర్లో 5163 కేసులు రూ.333.15 లక్షలు, మహబూబాబాద్లో 895 కేసులు రూ.43.51లక్షలు, మంచిర్యాల జిల్లాలో 2282 కేసులు రూ.142.80లక్షలు.
మేడ్చల్ మల్కాజ్గిరిలో 1245 కేసులు
మెదక్ జిల్లాలో 706 కేసులు రూ. 42.86లక్షలు, మేడ్చల్ మల్కాజ్గిరిలో 1245 కేసులు రూ.62.35లక్షలు, నాగర్కర్నూల్ జిల్లాలో 1110 కేసులు రూ.81.04లక్షలు, నల్లగొండలో 7807 కేసులు రూ. 476.54 లక్షలు, నారాయణపేట్లో 506 కేసులు రూ.32.61లక్షలు, నిర్మల్లో 938 కేసులు రూ.49.27 లక్షలు, నిజామాబాద్ జిల్లాలో 4923 కేసులు రూ.257.70లక్షలు, పెద్దపల్లిలో 659 కేసులు రూ. 29.14లక్షలు, రాజన్న సిరిసిల్లలో 351 కేసులు రూ.21.46లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 6221 కేసులు రూ. 382.80లక్షలు, సంగారెడ్డిలో 4886 కేసులు రూ.261.23లక్షలు, సిద్దిపేటలో 1259 కేసులు రూ. 79.33లక్షలు, సూర్యాపేటలో 1714 కేసులు రూ.102.44లక్షలు, వికారాబాద్లో 2652 కేసులు రూ.172.03 లక్షలు, వనపర్తిలో 642 కేసులు రూ.37.22లక్షలు, వరంగల్లో 882 కేసులు రూ. 49.98 కేసులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1040 కేసులు నమోదు చేయగా రూ. 76.52లక్షల జరిమానా విధించి వసూలు చేశారు. ఇది గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లు, కార్మికులపై అనుసరించిన విధానం స్పష్టమవుతున్నది.
గ్రేటర్ ఎన్నికల కోసమేనా?
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ఆటో డ్రైవర్ల సమస్యలను లేవనెత్తుతున్నది. అధికారంలో ఉన్నప్పుడు కేసులు నమోదు చేసిన బీఆర్ఎస్ పార్టీ.. కార్మికుల పోరాటంతో టాక్సీ మినహాయింపు మాత్రమే పొందినట్లు పలువురు కార్మికులు పేర్కొంటున్నారు. పూర్తిస్థాయిలో బీమా సదుపాయం కల్పించలేదని, ఆటో కార్మికులకు పూర్తిస్థాయిలో హామీలు అమలు చేయలేదని, నిబంధనలు విధించారని తెలిపారు. అయితే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడం, నియోజకవర్గంలో స్లమ్ ఏరియాలు ఎక్కువగా ఉండటం, గ్రామీణ ప్రజలు, ఆటోలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారు ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు ఆటో కార్మికుల అంశం అందుకుందనే విమర్శలు వస్తున్నాయి.
అక్టోబర్ 27న ఆటో కార్మికులతో ముచ్చటించే కార్యక్రమం చేపట్టింది. ఆటోలో బీఆర్ఎస్ నాయకులు ప్రయాణించి హడావుడి చేశారు. 161 మంది ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు చేసుకున్నారనీ, వారి కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ప్రతీ యేటా రూ.12 వేలు ఆటో డ్రైవర్లకు చెల్లించాల్సిందేనని కోరారు. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే, గత పాలనలో ఏం చేశారనేది ఇప్పుడు అదే ఆటో కార్మికులు ప్రశ్నలు సంధిస్తున్నారు. అధికారంలో ఉంటే ఒకవిధంగా.. అధికారం కోల్పోయాక మరో విధంగా వ్యవహరిస్తున్నారా? అని ఇప్పుడు పలువురు నిలదీస్తున్నారు.
Also Read: Uttam Kumar Reddy: ఆ డబ్బులను జిల్లా గ్రంధాలయ సంస్థకు ఇవ్వండి.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
