GHMC BJP: విస్తరణ, డీలిమిటేషన్పై భిన్నాభిప్రాయాలు
మజ్లిస్ కోసమే కొత్త వార్డులంటూ కమలనాథుల ఆరోపణ
ప్రజాభిప్రాయం తీసుకోకుండానే విలీనం చేశారన్న మర్రి శశిధర్ రెడ్డి
కాంగ్రెస్ , ఎంఐఎం కుమ్మక్కు అయ్యారంటూ చింతల ఎద్దేవా
నిరంకుశంగా నిర్ణయం తీసుకున్నారు: కృష్ణ యాదవ్
17వ తేదీ లోపు పూర్తి నివేదిక ఇస్తామన్న బీజేపీ నేతలు
జీహెచ్ఎంసీ కమిషనర్ను కలిసిన బీజేపీ నేతలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జీహెచ్ఎంసీ (GHMC Expansion) పరిధిలోని వార్డుల డీలిమిటేషన్పై రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. డీలిమిటేషన్పై అభ్యంతరాలు, సలహాల స్వీకరణకు తొలి రోజైన బుధవారం నాడు ఎంఐఎం ఎమ్మెల్యేలు, బీజేపీ కార్పొరేటర్లు పునర్విభజన జరుగుతున్న తీరుపై మండిపడిన సంగతి తెల్సిందే. అభ్యంతరాల స్వీకరణకు రెండో రోజైన గురువారం కూడా బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కమిషనర్ కర్ణన్ను కలిసి పునర్విభజన శాస్త్రీయంగా జరగడం లేదని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ, వార్డుల పునర్విభజన ప్రక్రియపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ఎంఐఎం (మజ్లిస్) పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వం ఈ హడావుడి నిర్ణయం తీసుకుందని (GHMC BJP) ఆరోపించింది. గురువారం బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ నేతృత్వంలోని బృందం గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ను కలిసింది. వార్డుల విభజన, విలీన ప్రక్రియపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది.
ప్రజాభిప్రాయాలు తీసుకోలేదు: మర్రి
27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వార్డుల డీలిమిటేషన్పై ప్రజాభిప్రాయాలు తీసుకోకుండానే ఏకపక్షంగా చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. కమిషనర్ను కలిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ, 650 చదరపు కిలోమీటర్ల పరిధి ఉన్న గ్రేటర్ను ఏకంగా 2 వేల కిలోమీటర్లకు పెంచారన్నారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజల అభిప్రాయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. ఒక వర్గానికి న్యాయం చేసేందుకే ఈ తంతు నడిపారని ఆయన మండిపడ్డారు. కేంద్రానికి వార్డు సెన్సస్ ఇవ్వాలనే సాకుతో కమిషనర్ ఇప్పుడు ఈ పని చేశారని అన్నారు. వార్డులకు సంబంధించిన మ్యాపులు ఎక్కడా లేవని, వెంటనే మ్యాపులు, పాత 150 వార్డుల జనాభా, కొత్త వార్డుల ఓటర్ల వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని అధికారులు చెప్పారని ఆయన వెల్లడించారు.
మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం చూస్తుంటే ఇది బాహుబలి పార్ట్-1 ను సినిమానా అని కమిషనర్ను అడిగామన్నారు. మజ్లిస్ గెలుపు కోసమే ప్రభుత్వం కుమ్మక్కై కొత్త వార్డులను తీసుకొచ్చిందని ఆరోపించారు. ప్రజలపై పన్నుల భారం ఎలా వేస్తారో చెప్పాలని నిలదీశారు. తాము ప్రత్యేక కమిటీలు వేసుకుని, 17వ తేదీ లోపు కమిషనర్కు తమ నివేదికను అందజేస్తామన్నారు. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ ఎప్పుడూ మహానగరాన్ని మంచి నగరంగా చూడాలనుకుంటుందని, కానీ ప్రభుత్వం నిరంకుశంగా విలీన నిర్ణయం తీసుకుందన్నవారు. వార్డులు, జోన్లు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మాకున్న అభ్యంతరాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. విస్తరణం పేరుతో వసతులు కల్పించకుండా ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని సూచించినట్లు తెలిపారు.
హైదరాబాద్ వార్డుల విభజనకు ప్రామాణికంగా తీసుకున్న 'సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్' (CGG) నివేదికను మరియు వార్డుల మ్యాపులను తక్షణమే బహిర్గతం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిజెపి ప్రతినిధుల బృందం డిమాండ్ చేసింది. కేవలం 6 రోజుల్లోనే 27 మున్సిపాలిటీల విలీనం మరియు 300 వార్డుల విభజన… pic.twitter.com/tQPupJCVuo
— BJP Telangana (@BJP4Telangana) December 11, 2025

