Bandi Sanjay: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని చెక్ డ్యాంలు కూలిపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానేరు నది (Maneru River)పై కట్టిన చెక్ డ్యాంలు కూలిపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు. తనుగుల – గుంపుల వద్ద చెక్ డ్యాం కూలిపోవడం తన ఆరోపణలకు నిదర్శనమని బండి అన్నారు. గత బీఆర్ఎస్ (BRS) పాలనలో కమిషన్లకు కుక్కుర్తిపడి నాణ్యతను గాలికి వదిలేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘కాంగ్రెస్ – బీఆర్ఎస్ డ్రామాలు’
చెక్ డ్యాంల నిర్మాణం, నిధుల చెల్లింపులపై మీరు ఆదేశించిన విజిలెన్స్ విచారణ ఏమైందని సీఎం రేవంత్ రెడ్డిని లేఖలో బండి సంజయ్ ప్రశ్నించారు. ఆనాడే బాధ్యులపై చర్యలు తీసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకుని ఉంటే తనుగుల-గుంపుల చెక్ డ్యాం కూలేది కాదని అసహనం వ్యక్తం చేశారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. ఆనాడు కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యతను గాలికొదిలేసిన బీఆర్ఎస్ నేతలు ఈరోజు ఏ ముఖం పెట్టుకుని తనుగుల వస్తున్నారని బండి ప్రశ్నించారు.
‘బాధ్యులపై చర్యలు తీసుకోండి’
కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్ల మానేరు నదిపై 57 చెక్ డ్యాంలు నిర్మించారని వాటికి సంబంధించి రూ.287 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని బండి సంజయ్ అన్నారు. ఆశ్చర్యకరంగా బీఆర్ఎస్ హయాంలో చెక్ డ్యాం నిర్మాణ ప్రాజెక్టులను ప్రస్తుత కాంగ్రెస్ నాయకులే చేజిక్కించుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చెక్ డ్యాంల నిర్మాణాల్లో అక్రమాలు, కూలిపోవడంపై విచారణ జరిపించాలని లేఖలో సీఎం రేవంత్ రెడ్డిని పట్టుబట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధ్యులైన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి.. వారి ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఆ సొమ్ముతోనే చెక్ డ్యాంలను మళ్లీ నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సలహా ఇచ్చారు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. రంగంలోకి ఓయూ వీసీ.. సన్ డిగ్రీ కాలేజీకి భారీ జరిమానా
2 రోజుల్లో.. 2 చెక్ డ్యాంలు
జమ్మికుంట మండలంలోని తనుగుల మానేరు చెక్ డ్యామ్ ను గుర్తు తెలియని వ్యక్తులు గత శుక్రవారం (నవంబర్ 21) రాత్రి కూల్చివేశారు. ఈ ఘటనపై స్థానికులు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సాధారణ విధ్వంసం కాదని, బలమైన ఇసుక మాఫియా కుట్ర కోణం ఉందని రైతులు బహిరంగంగా ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలోని మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం శనివారం (నవంబర్ 22)తెల్లవారుజామున కూలిన స్థితిలో దర్శనమిచ్చింది. 2022లో రూ.19 కోట్ల వ్యయంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ చెక్ డ్యాంను నిర్మించింది. పెద్ద ఎత్తున వరద వచ్చినా చెక్ డ్యాం కూలలేదని.. అకస్మాత్తుగా ఎలా ధ్వంసమైందో అర్థం కావడంలేదని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
