Hyderabad-Vijayawada: యాక్సిడెంట్ ఫ్రీ రహదారి నిర్మాణం
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 8 లేన్ల రహదారి పనులు ప్రారంభం
భారత్ ఫ్యూచర్ సిటీ-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు కూడా త్వరలోనే మొదలు
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : హైదరాబాద్ నుంచి విజయవాడకు రాబోయేకాలంలో ప్రయాణ సమయం తగ్గిపోనుంది. కేవలం 2 గంటల్లోనే చేరుకునేలా అధునాతన టెక్నాలజీతో యాక్సిడెంట్ ఫ్రీ రహదారి నిర్మాణం వచ్చే ఏడాది ప్రారంభంకానుంది. 2026 ఫిబ్రవరిలో హైదరాబాద్-విజయవాడ మధ్య 8 లేన్ల రహదారి పనులు ప్రారంభమవుతాయని తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉండడమే కాకుండా యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్న రహదారుల్లో ఒకటిగా ఉందని మంత్రి గుర్తుచేశారు. ఇప్పటికే 17 బ్లాక్ స్పాట్స్ గుర్తించి ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసినప్పుడు ఈ అంశాన్ని గుర్తు చేసినట్లు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాక్సిడెంట్ ఫ్రీ రహదారిని అందుబాటులోకి తీసుకురానున్నామని, అధునాతన టెక్నాలజీతో, పూర్తి నాణ్యతతో హైదరాబాద్ నుంచి విజయవాడకు రహదారిని నిర్మించబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ 8 లేన్ల రహదారి పనులు పూర్తయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం 2 గంటల్లో చేరుకోవచ్చని మంత్రి చెప్పారు. ఇదిలావుంచితే, భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 230 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవేపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పూర్తి సానుకూలంగా ఉన్నట్లు కోమటిరెడ్డి వెల్లడించారు. డీపీఆర్ ఎస్టిమేట్స్ త్వరలో పూర్తికానున్నాయని, గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయని వివరించారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడార్ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో గేమ్ ఛేంజర్గా నిలవబోతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also- Election Commission: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈసీ అబ్జర్వర్ల నియామకం
ప్రతీ బస్ స్టేషన్లో ప్రత్యేకాధికారి
ఆర్టీసీ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్లో మంత్రి పొన్నం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: సద్దుల బతుకమ్మ, దసరా పండుగను పురస్కరించుకొని సొంతూళ్లకు వెళ్లే వారికి రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్లో ప్రధాన రద్దీ ప్రాంతాలైన ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రయాణించేవారికి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రతి బస్ స్టేషన్లోనూ ప్రత్యేక అధికారిని నియమించాలని, అక్కడ రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలతో పాటు ఉన్నతాధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉంటూ 97 డిపోలు 340 బస్ స్టేషన్లు సమన్వయం చేసుకొని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని ఆదేశించారు. దసరా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 7754 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు మంత్రితెలిపారు. విధుల్లో అలసత్వం వహించొద్దని సూచించారు. సద్దుల బతుకమ్మ ఈ నెల 30న, దసరా అక్టోబర్ 2న ఉన్నదని, శనివారం నుంచే సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు.
Read Also- Ind Vs Pak Final: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్కు ఎన్ని టికెట్లు అమ్ముడుపోయాయో తెలుసా?