Team India | టీమిండియా పాకిస్థాన్ తో ఆట ఆడితేనే దేశమంతా క్రికెట్ చూస్తూ కూర్చుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇండియా గెలవాలని కోరుకోని భారతీయుడు ఉండడు. వరల్డ్ కప్ ఆటకు ఎంత క్రేజ్ ఉంటుందో.. ఇండియా (india), పాకిస్థాన్ (pakisthan) మ్యాచ్ కు మన దేశంలో అంతే క్రేజ్ ఉంటుంది. అలాంటి మన దాయాది పాకిస్థాన్ పేరు ఏకంగా టీమిండియా ఆటగాళ్ల జెర్సీలపై ఉండటంతో క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా ఆటగాళ్లు దుబాయ్ కు వెళ్లారు.
ఈ నెల 20న బంగ్లాదేశ్ తో తొలి మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త జెర్సీలతో ఆటగాళ్లు ఫోజులు ఇచ్చారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్, మహమ్మద్ షమీ లాంటి వాళ్ల ఫొటోలను బీసీసీఐ పోస్టు చేసింది. ఈ ఫొటోల్లో ఆటగాళ్ల జెర్సీలపై పాకిస్థాన్ పేరు ఉండటంతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మన ఇండియన్ జెర్సీలపై పాకిస్థాన్ పేరును తీసేయాలంటూ బీసీసీఐకి వేలాది రిక్వెస్టులు వెళ్తున్నాయి. కాగా దానిపై బీసీసీఐ కూడా స్పందించింది.
బీసీసీఐ క్రికెట్ బోర్డు ఐసీసీ రూల్స్ కు అనుగుణంగానే నడుచుకుంటుందని వెల్లడించింది. పాకిస్థాన్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి ఆటగాళ్ల జెర్సీలపై పేరును కలిగే హక్కు ఆ దేశానికి ఉంటుందని స్పష్టం చేసింది. దాన్ని తొలగించాలని తాము చెప్పలేం అంటూ బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అంతా సీనియర్లే ఎక్కువగా వెళ్లారు. ఎలాగైనా ట్రోఫీ గెలవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. కాగా బౌలింగ్ విషయంలోనే ఆందోళన కలుగుతోంది. బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉండటం కలిసొచ్చే అంశం.