IPL 2025: ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు. బెంగళూరు( Bengaluru)నీటి కరువు వార్తల్లోకి వస్తుంది. అసలే ఎండాకాలం.. ఎలాగూ నీటి కష్టాలు తప్పవు. మరి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులను ఐపీఎల్ అలరిస్తోంది. ధనాధన్ షాట్లతో అలరించే పొట్టి క్రికెట్ (T20)మ్యాచ్ లను లైవ్ లో చూడాలని..స్టార్ ప్లేయర్లను ప్రత్యక్షంగా వీక్షించాలని ఫ్యాన్స్ కోరుకుంటుంటారు.
ఇక దాదాపు 32 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం కలిగిన చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్లో భాగంగా నిర్వహించే ఒక్కో మ్యాచ్కు 75,000 లీటర్లకు పైగా నీటి అవసరం ఉంది. ఈ ఏడాది కూడా వర్షాభావం, భూగర్భ జలాలు తగ్గిపోవడం, నగరంలో భారీగా నిర్మాణాలు పెరగడంతో నీరు భూమిలోకి చేరే మార్గాలు తగ్గిపోవడం వంటివి బెంగళూరులో నీటి సమస్యకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇటు రాజకీయ విమర్శలు చెలరేగుతున్న సమయంలో ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణపై ఈ ఏడాదీ సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
నగరంలోని ప్రజల అవసరాలకే నీరు లభించని వేళ గతేడాది కూడా ఐపీఎల్ మ్యాచ్ లను తరలించాలన్న డిమాండ్ల నేపథ్యంలో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మేనేజ్మెంట్ బోర్డ్ విన్నపంపై.. ది బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (BWSSB) కీలక నిర్ణయం తీసుకుంది. స్టేడియం అవసరాలకు వేస్ట్వాటర్ను శుద్ధి చేసి చిన్నస్వామి స్టేడియంకు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ నీటిని కబ్బన్ పార్క్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి తీసుకుని సరఫరా చేశారు. దీంతో గతేడాది మ్యాచ్ లు గట్టెక్కాయి. ఇప్పుడు తాజాగా మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా..మరోసారి బెంగళూరునీటి ఎద్దడిపై చర్చ మొదలైంది.
బెంగళూరు నీటి సంక్షోభంపై ప్రతిపక్ష బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ భరత్ శెట్టి (Bharathsetti)మాట్లాడిన నేపథ్యంలో మళ్లీ ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణకు నీటి సరఫరా విషయంలో గందరగోళం చెలరేగింది. నీటి ఎద్దడి నుంచి సాక్షాత్తూ “భగవంతుడు కూడా బెంగుళూరును రక్షించలేడు” అని ఇటీవల కర్ణాటక ఉపముఖ్యమంత్రి DK శివకుమార్ (DK. Shiva Kumar) వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. గతేడాది మాదిరిగానే శుద్ధి చేయబడిన మురుగునీటిని స్టేడియం నిర్వహణకు ఉపయోగిస్తుంటే.. మరి మన నగరం నీటి అవసరాలను తీర్చేందుకు ఇలాంటి ప్రత్యామ్నాయాలను అధికారులు చేయాలని భరత్ శెట్టి వాదిస్తున్నారు.
దీంతో మరోసారి బెంగళూరులో ఐపీఎల్ (IPL) మ్యాచ్లకు నీటి కష్టాలు వెంటాడేలా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఏప్రిల్ 2 నుంచి మే 17 వరకు ఏడు మ్యాచ్ లు జరగనున్నాయి. మరి సజావుగా సాగుతాయా..? లేదంటే రాజకీయ దుమారంతో మ్యాచ్ లను వేరే వేదికకు తరలిస్తారా వేచి చూడాలి.