IND vs ENG 2nd T20 | ఓపెనర్లు తుస్సుమన్నారు. కెప్టెన్ సూర్య మరోసారి తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టాడు. ధ్రువ్ జురెల్ , హార్దిక్ పాండ్య , అక్షర్ పటేల్ విఫలమయ్యారు. తిలక్ వర్మ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతనికి సహకారం అందిస్తున్న వాషింగ్టన్ సుందర్ కూడా పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ జట్టుకు విజయావకాశాలు కనిపించాయి. ఇక ఎనిమిదో వికెట్ గా 6 పరుగులకు అర్షదీప్ ఔటైన సమయంలో భారత్ విజయానికి 18 బంతుల్లో 20 రన్స్ కావాలి. నరాలు తెగే ఉత్కంఠ.. చేతిలో ఉన్నవి రెండే వికెట్లు.. వికెట్ కాపాడుకోవాలి.. పరుగులు చేయాలి.. అప్పటికి తిలక్ వర్మ (61) పరుగులతో క్రీజులో ఉన్నాడు. బ్యాటింగ్ లో అదరగొట్టిన కార్సే.. బౌలింగ్ లోనూ ఇరగదీస్తున్నాడు.
అయితే కార్సే వేసిన 18వ ఓవర్లో అనూహ్యంగా రవిబిష్ణోయ్ 5వ బంతికి బౌండరీ కొట్టాడు. దీంతో 18 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 153/8. టీమిండియా లక్ష్యం 12 బంతుల్లో 12 పరుగులు. 19వ ఓవర్ వేసిన లివింగ్ స్టోన్ బంతులను తిలక్ ఆచితూచి ఎదుర్కొన్నాడు. తొలి రెండు బంతులకు సింగిల్ తీయకుండా నిలిచి మూడో బంతికి రెండు పరుగులు.. నాలుగో బంతికి సింగిల్ తీసుకున్నాడు. ఇక రవి బిష్ణోయ్ 5వ బంతిని థర్డ్ మ్యాన్ దిశగా అద్భుతమైన షాట్ తో బౌండరీ కొట్టడంతో చివరి ఓవర్ తొలి బంతికి రెండు పరుగులు.. రెండో బంతికి ఫోర్ తో తిలక్ వర్మ భారత్ కు ఉత్కంఠ విజయాన్నందించాడు. బౌలర్లు సహకరిస్తున్న పిచ్ పై అద్భుతమైన బ్యాటింగ్ తో భారత్ కు ఒంటిచేత్తో విజయాన్నందించాడు. IND vs ENG 2nd T20 మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ తో టీమిండియాకు అద్భుత విజయాన్నందిచిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు.
చెన్నై: టీ20 ప్రపంచ చాంపియన్ భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. తొలి టీ20లో సునాయాస విజయం అందుకున్న భారత్.. చెపాక్ లో జరిగిన రెండో టీ20లో మాత్రం విజయం కోసం తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 19.2 ఓవర్లలో ఛేదించి ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. భారత సూపర్ బ్యాటర్, తెలుగుతేజం తిలక్ వర్మ (72 నాటౌట్; 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడి చివరివరకు క్రీజులో నిలిచి భారత్ను గెలిపించాడు. తిలక్ వర్మకు తోడుగా వాషింగ్టన్ సుందర్ (26; 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అభిషేక్ శర్మ (12), సూర్యకుమార్ యాదవ్ (12) పరుగులు చేశారు. సంజు శాంసన్ (5), ధ్రువ్ జురెల్ (4), హార్దిక్ పాండ్య (7), అక్షర్ పటేల్ (2) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే 3, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, జేమీ ఒవర్టన్, లివింగ్స్టన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో విజయంతో ఐదు టీ20ల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో టీ20 మంగళవారం (జనవరి 28) రాజ్కోట్లో జరగనుంది.
మళ్లీ ఆదుకున్న బట్లర్
టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ ఎలాంటి ఆలోచన లేకుండా ఇంగ్లండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. కాగా, ఇంగ్లండ్ జట్టులో మళ్లీ జోస్ బట్లర్ (45; 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక మిగిలిన బ్యాటర్లలో ఆల్ రౌండర్ బ్రైడన్ కార్సే (31; 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు) అద్భుతమైన షాట్లతో అలరించగా.. జేమీ స్మిత్ (22; 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు) దూకుడుగా ఆడాడు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (4), బెన్ డకెట్ (4) మళ్లీ విఫలమై సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు. హ్యారీ బ్రూక్ (13), లివింగ్స్టన్ (13) పరుగులు చేశారు. బట్లర్ కాకుండా, బ్రైడెన్ కార్స్ సుడిగాలి ఇన్నింగ్స్ తో ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 2, వరుణ్ చక్రవర్తి 2, అర్ష్దీప్ సింగ్, హార్దిక్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ సాధించారు.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				