CM Revanth Reddy: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్(వైఐఐఆర్సీ) మొదటి విడుతలో పూర్తయ్యే వాటిలో బాలికలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. రానున్న మూడేళ్లలో ప్రతి నియోజకవర్గంలోనూ బాలురు, బాలికలకు ఒక్కొక్కటి చొప్పున వైఐఐఆర్సీ నిర్మాణాలు పూర్తి చేయాల్సిందేనన్నారు. ప్రస్తుతం బాలికలకు స్కూల్స్ కేటాయించిన నియోజకవర్గంలో మరో విడుతలో బాలురకు ఇవ్వాలని సూచించారు. విద్య శాఖపై రాష్ట్ర సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. వైఐఐఆర్సీలో సోలార్ కిచెన్ల నిర్మాణాన్ని పీఎం కుసుమ్లో చేపట్టే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. నిర్మాణాలకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆదేశించారు.
అన్నిచోట్లా బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం
ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థల ద్వారా అమలు చేస్తున్న బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. తగినంత స్థలం, అవసరమైన మద్దతు అందజేస్తే పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయగలమని అక్షయపాత్ర ప్రతినిధులు రేవంత్కు తెలియజేశారు. ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి అందరికీ సకాలంలో భోజనం అందేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు రెండు ఎకరాల స్థలం కేటాయింపు లేదా 99 సంవత్సరాలకు లీజు తీసుకునే అంశంపై కలెక్టర్లతో మాట్లాడి త్వరగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సూచించారు.
Also Read: CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గౌరవ మర్యాదలకు భంగం కలగనివ్వం: సీఎం రేవంత్
చదువు పూర్తవ్వగానే ఉద్యోగం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 23 నూతన పాఠశాల భవనాల నిర్మాణాలు వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి రావాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాచుపల్లి పాఠశాల స్థలం కేవలం అర ఎకరం మాత్రమే ఉండడంపై ఆరా తీశారు. ఎక్కడైనా పాఠశాలకు కనీసం ఎకరన్నర స్థలం ఉండాలని, బాచుపల్లి ప్రస్తుతం ఉన్న స్థలం సమీపంలో అవసరమైన స్థలం నిర్మాణానికి కేటాయించాలని ఆదేశించారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు తగినట్లు ఒకటి నుంచి పదో తరగతి వరకు సిలబస్ మార్పుపై కసరత్తును వెంటనే ప్రారంభించాలని చెప్పారు.
పనులు వేగవంతం చేయాలి
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయం పనులు వేగవంతం చేయాలని సూచించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో నూతన కోర్సులు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్తో ఒప్పందం చేసుకున్నందున దానిని త్వరగా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి కచ్చితంగా ఉద్యోగం లభించేలా సిలబస్, బోధన ఉండాలని అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, సుదర్శన్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, ఓయూ వీసీ మొలుగారం కుమార్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వీసీ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Also Read: CM Revanth Reddy: మంత్రులకు బిగ్ టాస్క్.. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ కొట్టాలని సీఎం ఆదేశం..!

