CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మంత్రుల కంటే అధికారుల హడావుడి ఎక్కువవుతోందా? పాలకుల కంటే ముందే అధికారుల కీలకమైన నిర్ణయాలను బయట పెడుతున్నారా? దీని వలన ప్రభుత్వం రక్షణలో పడాల్సి వస్తుందా? అంటే తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ముఖ్యంగా జీవోల నుంచి విధానమైన నిర్ణయాలు, క్యాబినెట్ డిస్కషన్స్ వంటివి ముందే లీకవుతున్నాయనే అనుమానం మంత్రులలో ఉన్నది. దీనిపై సీఎం కూడా గతంలోనే సీరియస్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ, కొందరు ఆఫీసర్లలో ఇప్పటికీ తీరు మారలేదనే చర్చ సచివాలయం వర్గాల్లో జరుగుతున్నది. తాజాగా టీ హబ్ వ్యవహారం సర్కార్ను డైలమాలో పడేసింది. అధికారులు వ్యవహరించిన తీరుపై ఏకంగా అమెరికాలో ఉన్న సీఎం ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. ప్రస్తుతం పెట్టుబడుల వేటలో అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడ ఉండి రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వం ఒక విజన్తో ముందుకు వెళ్తుంటే, క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల పాలనపై ప్రతికూల ప్రభావం పడుతోందని సీఎం భావిస్తున్నారు. మంత్రులు కూడా కొందరు అధికారుల తీరును తప్పుపడుతూనే.. పద్ధతి మార్చుకోవాల్సిందేనంటూ హెచ్చరిస్తున్నారు.
వివాదాస్పదంగా టీ హబ్ ఇష్యూస్
గతంలో టీ హబ్ సీఈవో మార్పునకు సంబంధించిన అంశం ప్రభుత్వానికి పెద్ద ఎత్తున డ్యామేజ్ కలిగించింది. ఇది మరువకముందే అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్కు మార్చాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై పబ్లిక్, ఐటీ ఎంప్లాయిస్, సోషల్ మీడియా, స్టార్టపర్ల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. దీన్ని అదనుగా ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై ఎదురుదాడి చేశాయి. దీన్ని తెలుసుకున్న అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఫోన్ చేసి టీ హబ్ను కంటిన్యూ చేయాలని నొక్కి చెప్పారు. అయితే, ఈ నిర్ణయం ప్రభుత్వానికి తెలియకుండా అధికారులే తీసుకున్నారా? లేదా? తొలుత నిర్ణయం తీసుకొని వ్యతిరేకత రావడంతో ఆ తర్వాత వెనక్కి తగ్గారా? అనేది తెలియాల్సి ఉన్నది. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాపిక్గా మారింది. అంతర్జాతీయ స్థాయి స్టార్టప్ ఎకోసిస్టమ్ను దెబ్బతీసేలా అధికారులు వ్యవహరించారని మంత్రులు సైతం విస్తుపోతున్నారు. ప్రభుత్వం ఒక పాలసీని ప్రకటించక ముందే, దానికి సంబంధించిన ఫైళ్లు, విధానాలు ముందే లీకవడం వలన ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నట్లు మంత్రులు వాపోతున్నారు.
Also Read: CM Revanth Reddy: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
గతంలో అనేక కీలకమైన అంశాల్లోనూ
కేవలం టీ హబ్ మాత్రమే కాదు, గత కొద్ది నెలలుగా పలు కీలక నిర్ణయాలు ముందే లీక్ అయ్యాయని స్వయంగా మంత్రులే చెప్తున్న పరిస్థితి నెల కొన్నది. జాబ్ క్యాలెండర్, టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన కీలక అంశాలు అధికారికంగా వెల్లడించక ముందే సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అంతేగాక కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తుండగానే, అసంపూర్తిగా ఉన్న నిబంధనలు లీక్ అవ్వడంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. ఇక భూ రికార్డుల విషయంలో ప్రభుత్వం తీసుకునే సాహసోపేత నిర్ణయాలు జీవోల రూపంలో రాక ముందే లీక్ కావడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఆందోళన నెలకొంది. ఉన్నతాధికారుల బదిలీల జాబితా ముందుగానే లీక్ అవ్వడం వల్ల పైరవీ కారులకు అవకాశం చిక్కినట్లయింది. హిల్ట్ పాలసీ తదితర నిర్ణయాలూ ముందే బయటకు రావడంపై రాజకీయ పార్టీల మధ్య ఫైట్ గా మారింది. తాము విధానపరమైన నిర్ణయం తీసుకునే లోపే, అధికారులు ఆ నిర్ణయాన్ని అమలు చేసినట్లుగా లేదా మార్చినట్లుగా ప్రచారం చేయడం వలన ప్రజల్లో కన్ ప్యూజన్ నెలకొంటుందని ఓ సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు.
టీ హబ్ను కొనసాగించాల్సిందే: సీఎస్కు సీఎం ఆదేశాలు
టీ హబ్ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాల్సిందేనంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఫోన్ చేసి మాట్లాడారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు. టీ హబ్ను ప్రత్యేక స్టార్టప్ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారు. ఇంక్యుబేటర్గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్గా స్టార్టప్లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ హబ్లో ఇతర ఆఫీసులు ఉండకూడదని, అలాంటి ఆలోచనలుంటే విరమించుకోవాలని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు.
Also Read: CM Revanth Reddy: తెలంగాణ మంత్రులకు సీఎం వార్నింగ్.. ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే కుట్ర..?

