KTR: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఎందుకు పిరికివాళ్లుగా మారిపోయారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి మంత్రి కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. నిజంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్కు దమ్ముంటే, ‘అవును, వారు మా కాంగ్రెస్లో చేరారు, ఉప ఎన్నికలకు పోదాం’ అని చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణ భవన్లో భద్రాచలం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నుంచి మొదలుకొని ప్రతి ఎన్నికను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వణికిపోతున్నదన్నారు. ‘ఎన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవు. ఖచ్చితంగా వీరికి ఓటమి ఖాయం’ అని ధీమా వ్యక్తం చేశారు. ఫిరాయింపుల కారణంగా పార్టీలో కల్తీ పోయిందని, ఎవరు ఏంటో తెలిసిపోయిందని, ఇప్పుడు పార్టీ మరింత బలంగా మారిందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని దరిద్రమైన స్థితిలో ఉన్నారని, కనీసం ముఖ్యమంత్రి లేదా రాహుల్ గాంధీకి కూడా తమ పార్టీలో చేర్చుకున్న వారిని తమ ఎమ్మెల్యేలుగా చెప్పుకునే పరిస్థితి లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులు వద్దంటే, రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులు చేసి బయటకు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ నైజం మోసమే పునాది అన్నారు. అబద్ధాల పునాదుల మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరించడంలో పార్టీగా మేం విఫలమయ్యామన్నారు. బీఆర్ఎస్ చేసిన మంచిని, అభివృద్ధిని చెప్పుకోలేకపోయాము అని అన్నారు. ఆ రోజే కాంగ్రెస్ మోసపు పార్టీ అని ప్రజలకు వివరిస్తే బాగుండేదని, అయితే అనేక త్యాగాలు, ఉద్యమాలతో వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్రంపైనే దృష్టి పెట్టామని, రాజకీయాలపై దృష్టి పెట్టలేదని స్పష్టం చేశారు.
ఒక కాంగ్రెస్ నాయకుడు కూడా మిగిలేవాడు కాదు
కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్న తీరుగా అప్పుడు ప్రతిపక్షాలను అణచివేసి ఉంటే, కనీసం ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక కాంగ్రెస్ నాయకుడు కూడా మిగిలేవాడు కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనను నడిపించే సత్తా లేదని, అందుకే ప్రతిసారీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెపం నెట్టేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి హనీమూన్ పీరియడ్ అయిపోయిందని, అందరికీ వారిపై నమ్మకం పోయిందని తేల్చి చెప్పారు. గత దీపావళికి ‘బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారని, మళ్ళీ దీపావళి వచ్చిందని గుర్తు చేశారు. “తంతే గారెలు బుట్టలో పడినట్టు, లక్కీ లాటరీలో పడ్డట్టు మంత్రి అయినా పొంగులేటి పెద్దగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మళ్ళీ పాలేరులో ఎలా గెలుస్తారో చూద్దామని సవాల్ విసిరారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై సమావేశం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేవారు. తెలంగాణ భవన్ లో మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికలో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి, జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ విజయయాత్రను తిరిగి ప్రారంభించాలని పిలుపునిచ్చారు. గత 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు.
హైదరాబాద్ను తెలంగాణ ఆర్థిక ఇంజిన్గా మార్చిన గత పదేళ్ల తమ ప్రభుత్వ పాలనకు భిన్నంగా, కాంగ్రెస్ పార్టీ విధానాలు నగరాన్ని పూర్తిగా కుప్పకూల్చేలా ఉన్నాయని, ఈ విషయాన్ని నగర ప్రజలు గమనిస్తున్నారన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కొనసాగాలంటే భారత రాష్ట్ర సమితి మళ్లీ అధికారంలోకి రావాల్సిందేనని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సృష్టించిన భయం కారణంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, అన్ని రంగాలపై కాంగ్రెస్ అసమర్థ విధానాల ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు ప్రభుత్వ విధానాలతో నష్టపోయాయని తెలిపారు.
Also Read: Anganwadi Salary Hike: అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 18000 ఇవ్వాలి.. మంత్రి సీతక్కకు విజ్ఞప్తి