– ఓవైపు వెంటాడుతున్న కేసులు
– ఇంకోవైపు జంప్ అవుతున్న నేతలు
– ఫ్రస్ట్రేషన్లో ఏదిబడితే అది మాట్లాడుతున్నారా?
– బంజారాహిల్స్ పీఎస్లో క్రిమినల్ కేసు
KTR Shows Their Frustration : రాజకీయాల్లో హుందాతనం అవసరం. లేనిపోని నిందలు వేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నాలుగు రోజులు మీడియాలో హైలైట్ కావడం, ఇవే ఇప్పటి పాలిటిక్స్గా మారిపోయాయి. అయితే, ఒక్కోసారి ఇవే చిక్కులు తెచ్చిపెడతాయి. ప్రస్తుతం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అంటున్నారు రాజకీయ పండితులు.
క్రిమినల్ కేసు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నాయకుల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై క్రిమినల్ కేసు ఫైల్ అయింది. కాంగ్రెస్ నేత బత్తిని శ్రీనివాస్ రావు హన్మకొండ పోలీసులకు కేటీఆర్పై ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే క్రిమినల్ కేసు నమోదు చేసిన హన్మకొండ పోలీసులు, కేసును హైదరాబాద్ బంజారాహిల్స్ పీఎస్కు బదిలీ చేశారు. ఐపీసీ సెక్షన్ 504, 502(2) సెక్షన్ల కింద కేటీఆర్పై కేసు నమోదైంది.
Read Also: తెలంగాణ టచ్.. పాలిటిక్స్
కేటీఆర్ ఏమన్నారంటే..?
పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల సికింద్రాబాద్ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి సామంత రాజులా వ్యవహరిస్తున్నారని అన్నారు. అంతేకాదు, రూ.2,500 కోట్లను ఢిల్లీకి కప్పం కట్టారని ఆరోపించారు. అందర్నీ బెదిరించి మరీ రేవంత్ డబ్బులు వసూలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు బత్తిని శ్రీనివాస్ రావు.
కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా?
ఈమధ్య బీఆర్ఎస్ను కష్టాలు వెంటాడుతున్నాయి. కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు కేటీఆర్ హైదరాబాద్ టు ఢిల్లీ టూర్లు వేస్తున్నారు. ఇదే టైమ్ ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ బీఆర్ఎస్ నేతలకు చిక్కులు తప్పేలా లేవు. పైగా, నాయకులు వరుసబెట్టి జంప్ అవుతున్నారు. దీంతో కేటీఆర్లో ఫ్రస్ట్రేషన్ ఎక్కువవుతోందనే చర్చ జరుగుతోంది. అందుకే, రెండు పిల్లర్లు కుంగితే ఏమైంది? ఒకరిద్దరి ఫోన్లు ట్యాప్ అయితే పెద్ద విషయమా? అంటూ మాట్లాడుతున్నారని అంటున్నారు. ప్రభుత్వం, సీఎం రేవంత్ పైనా సంచలన ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు.