- సాగర్ జలాశయంలోని నీటి కేటాయింపులు
- తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు
- జలసౌధలో ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం
- మే నెలలో మరోసారి భేటీ
తెలంగాణ ఇప్పటికే కరువు ఛాయలు ఏర్పడుతున్నాయి. వేసవి వేళ నీటి ఎద్దడి ఏర్పడే ముప్పు ఉందని అనుమానాలు వస్తున్నాయి. ఈ తరుణంలో క్రిష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ట్రిబ్యునల్ హైదరాబాద్లోని జలసౌధలో శుక్రవారం సమావేశం నిర్వహించింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే సారథ్యంలో జరిగిన త్రిసభ్య కమిటీ భేటీలో తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. నాగార్జున సాగర్ జలాశయంలోని నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించడంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ప్రస్తుతం సాగర జలాశయంలో 14 టీఎంసీ నీటి లభ్యత ఉన్నది. ఇందులో 8.5 టీఎంసీ నీటిని తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కు 5.5 టీఎంసీ నీటిని కేటాయిస్తూ కేఆర్ఎంబీ నిర్ణయం తీసుకుంది.
కేఆర్ఎంబీ ట్రిబ్యునల్ గత అక్టోబర్ నెలలో సమావేశమైంది. అప్పుడు జంట జలాశయాలైన నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యామ్లలోని నీటి నిల్వలపై చర్చించారు. వీటిలటో 82 టీఎంసీలకు మించి నీరు ఉన్నదని గుర్తించారు. అప్పుడు ఈ నీటిని ఉభయ రాష్ట్రాలకే కేటాయించారు. ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీల నీటిని కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. తాజా భేటీలో ఈ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఇందులో తమకు మరో ఐదు టీఎంసీల మిగులు ఉన్నదని, తెలంగాణ మాత్రం అదనంగా 7 టీఎంసీల నీటిని వినియోగించిందని ఏపీ ఈఎన్సీ నారాయణ్ రెడ్డి పేర్కొన్నారు. కాబట్టి, సాగర్ నుంచి తమకు వెంటనే 5 టీఎంసీ నీటిని అందించాలని కోరారు.
Also Read: ఆరూరి V/s కడియం.. మాటల తూటాలు
తెలంగాణ ఈఎన్సీ అనిల్ ఆయన వాదనను కొట్టివేశారు. ఏపీనే ఎక్కువ మొత్తంలో నీటిని వినియోగించుకున్నదని, అంతా లెక్కలోకి రాలేదని, శ్రీశైలం నుంచి ఏపీ నీరు తీసుకోకుండా చూడాలని కోరారు. కాగా, సాగర్ దిగువన తమకు నీటి ఇబ్బందులు ఉన్నాయని, ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాల్సి వస్తున్నదని అనిల్ తెలిపారు. హైదరాబాద్ సహా నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లోని ప్రజలు తాగు నీటి కోసం సాగర్ పైనే ఆధారపడ్డారని, ఇక హైదరాబాద్ జనాభాను కూడా దృష్టిలో ఉంచుకుని నీరు కేటాయించాలని పేర్కొన్నారు.
దీంతో సాగర్ జలాశయంలోని 14 టీఎంసీల నీటిని తెలంగాణకు 8.5 టీఎంసీ, ఏపీకి 5.5 టీఎంసీల నీటిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నీటి ఎద్దడి తీవ్రమయ్యే ముప్పు ఉన్న నేపథ్యంలో మే నెలలో మరోసారి కేఆర్ఎంబీ భేటీ కావాలని నిర్ణయించింది.